TG Municipal Polls: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సోలో షో చేస్తానంటోంది.. ఏపీలో పొత్తుల ఈక్వేషన్లు తెలంగాణలో వర్కౌట్ అవ్వవని బీజేపీ భావిస్తోందా? తెలంగాణ పురపోరులో జనసేన పోటీపై ఇఫ్పటికే ప్రకటన వెలువడింది. దాంతో పొత్తులు లేకుండా పోటీకి దిగితే అది కమలం పార్టీకి ప్లస్సా..? మైనస్సా..? అసలు మున్సిపల్ బరిలో బీజేపీ వన్ మ్యాన్ ఆర్మీగా అనుకున్న ఫలితాలను సాధిస్తుందా..? జనసేన ఎంట్రీతో బీజేపీ ఓట్లు చీలుతాయా..?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరి పోరుకే సిద్ధమంటూ కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జనసేన, టీడీపీలతో మైత్రి కొనసాగుతున్నా.. తెలంగాణలో మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలను బలంగా మార్చుకుని మున్సిపాలిటీల్లో సత్తా చాటాలనే వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోంది. అంతేకాదు సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాలపై సాధించిన పట్టు, మున్సిపాలిటీలపై సాధించాలనే పట్టదలతో, వచ్చే పురపాలిక ఎన్నికలకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
మున్సిపోల్స్లో ఫలితాలు ఎవరికి మొగ్గు చూపుతాయన్నది అటుంచితే, జనసేన ఎంట్రీతో బీజేపీ మూడ్ మారినట్టు కనిపిస్తోందంటున్నారు. ఏపీలో అలయన్స్ ఉన్న పార్టీ.. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లను చీల్చి తమకు గండి కొడుతుందని…. రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగే అవకాశముందని కాషాయ నేతలు భావిస్తున్నారంట. అదే గుబులు జనసైనికుల్లో కూడా గుబులు రేపుతోందంట.
ఏపీలో జనసేన పార్టీతో బీజేపీ రాజకీయ మైత్రి కొనసాగుతున్నప్పటికీ, అదే ఫార్ములా తెలంగాణలో అమలు కాదని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారంట. ఇక తెలంగాణలో జనసేన కూడా స్వతంత్రంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉండటంతో…ఇరు పార్టీల మధ్య నేరుగా రాజకీయ సమరం జరిగే అవకాశం కనిపిస్తోందన్న చర్చ జరుగుతోందట. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్థాయిలో పార్టీకి లభించిన ఫలితాలు ఇచ్చిన బూస్ట్తో, పట్టణ ప్రాంతాల్లో జరిగే మున్సిపల్ సెగ్మెంట్లలో అదే ఊపును కొనసాగించాలన్న వ్యూహంలో కాషాయ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలుచుకుంటూ…మున్సిపల్ డివిజన్లలో ఓటర్లను ఆకట్టుకునేలా బీజేపీ క్షేత్రస్థాయి కార్యాచరణను రూపొందిస్తోంది. తెలంగాణలో ఉనికిలో లేని పార్టీలతో పొత్తులు లేకుండా బరిలోకి దిగడం ద్వారా పార్టీ కేడర్లో ఆత్మవిశ్వాసం పెంచడమే కాకుండా….భవిష్యత్తులో అధికార, ప్రతిపక్షా పార్టీలకు ధీటుగా ..బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది బీజేపీ ఆలోచనంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే టార్గెట్గా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందట.
అంతేకాదు అభ్యర్థుల ఎంపికలోనూ గెలిచే సత్తా ఉన్న నాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో బీజేపీ కసరత్తు మొదలుపెట్టిందట. రికమండేషన్ పని చేయదు, నేతల వెంట తిరిగితే టికెట్ల రావు అన్న సంకేతాలు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆశావహులకు ఇచ్చినట్టుగా సమాచారం. ఆయా సామాజిక వర్గాల సమీకరణాలు, స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుని టికెట్లు ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ, జనసేన పార్టీలతో ఎలాంటి పొత్తుల్లేని ఈ రాజకీయ పురపోరులో కమలం పార్టీ ఎంత మేరకు సత్తా చాటుతుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ ఫార్ములా తెలంగాణలో తూచ్ అవుతుందన్న అంచనల్లో తెలంగాణ బీజేపీ ఉండటం సర్వత్ర చర్చనీయాంశంగా మారుతోంది. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఫెయిల్యూరేనా..? ఒకవేళ సక్సెస్ అయితే తెలంగాణలో ఎందుకు భాగస్వామ్య పార్టీలను బహిష్కరిస్తున్నారు అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్లో వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర పార్టీలుగా ముద్ర పడ్డ టీడీపీ, జనసేనలతో పొత్తులు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీకి భారీ గండి పడక తప్పదన్న లెక్కలతో రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు పన్నుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరు అంటున్న బీజేపీ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Story by: Apparao, Big Tv