Panchayat Elections: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి టాప్.. ఆ తర్వాత స్థానంలో సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి .. లాస్ట్ ప్లేస్లో ఫస్ట్ టైం మినిస్టర్ వివేక్ వెంకటస్వామి… ఏంటి క్యాబినెట్ మెంబర్స్కి కొత్త ర్యాంకులు, ఎప్పుడిచ్చారనుకుంటున్నారా? కొత్తగా ర్యాంకులు ఇచ్చిందేమీ లేదండి.. సర్పంచ్ ఎన్నికల్లో తమ సెగ్మంట్లో పట్టు సాధించిన అమాత్యుల గ్రేడింగ్ ఇది… సీఎం రేవంత్, మంత్రులు ఉత్మమ్, సీతక్క 75 శాతానికి పైగా పంచాయతీలు గెలిపించుకున్నారు.వివేక్ తన సెగ్మెంట్లో 48 శాతం స్థానాలకే పరిమితమై మంత్రుల్లో వెనుకబడి ఉన్నారు. ఇక కొల్లాపూర్, హుస్నాబాద్లలో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చి కాంగ్రెస్కు సవాల్ విసిరింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు చోట్ల కమలనాథులు ఖాతా తెరవలేకపోయారు… రిజర్వ్డ్ సెగ్మెంట్ అయిన చెన్నూరులో ఏకంగా 35 మంది ఇండిపెండెంట్లు గెలిచి మంత్రి వికేక్కు షాక్ ఇచ్చారు.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు తమ పట్టు నిలుపుకున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీస్థాయిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారని మూడు విడతల్లో వెల్లడైన ఫలితాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఎక్కువమంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. కొడంగల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసి 140 మంది గెలుపొందగా, బీఆర్ఎస్- 30, బీజేపీ -2 స్థానాలకు పరిమితమయ్యాయి. ఆ తర్వాత ఉత్తమ్కుమార్రెడ్డి తన నియోజకవర్గం హుజూర్నగర్లో 111 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో వేశారు. అక్కడ బీఆర్ఎస్ 29 స్థానాలు దక్కించుకోగా బీజేపీ ఖాతా తెరవలేక పోయింది.
సీతక్క సైతం ములుగులో111 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల్ని గెలిపించుకున్నారు. గులాబీ పార్టీ 30 స్థానాలకు పరిమితమైన ఈ సెగ్మెంట్లో బీజేపీ పూర్తిగా చేతులెత్తేసింది. బీజేపీ ఖాతా తెరవలేకపోయిన ములుగులో 8 మంది ఇండిపెండెట్లు విజయం సాధించడం విశేషవ. ఈ ముగ్గురి నియోజకవర్గాల్లో 75 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలుపొందడం విశేషం.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ సెగ్మెంట్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన 64 మంది గెలిచారు. బీఆర్ఎస్ 22 సర్పంచ్ స్థానాల్లో తాను బలపర్చిన అభ్యర్ధుల్ని గెలిపించుకుంటే, బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మంధని నుంచి ప్రాతిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీధర్బాబు పార్టీ మద్దతిచ్చిన 115 మందిని గెలిపించుకుని సత్తా చాటుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ -33, బీజేపీ ఒక స్థాన దక్కించుకోగా ఏకంగా 14 మంది ఇండిపెండెట్లు ప్రధాన పార్టీలను సవాల్ చేస్తూ గెలుపు మెట్లెక్కారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ -11 స్థానాలు కైవసం చేసుకోగా బీజేపీ సున్నాకే పరిమితమైంది. ఖమ్మం జిల్లా 70 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 60 శాతం కంటే ఎక్కువ అధికార పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో మధిర, అందోల్, పాలేరు ఉన్నాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్లో కూడా దాదాపు 60 శాతం స్థానాల్లో హస్తం పార్టీ సహకారంతోనే సర్పంచ్లుగా గెలిచారు. వాకిటి శ్రీహరి (మక్తల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)లలో 50–60 శాతం మధ్యలో విజయం దక్కించుకోగలిగారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కంచుకోట మధిరలో కాంగ్రెస్ బలపర్చిన 90 మంది అభ్యర్ధులు గెలుపొందారు… మధిరలో బీఈర్ఎస్ 21 స్థానాలు దక్కించుకుంటే, ఇండిపెండెంట్లు 20మంది విజయం సాధించి గులాబీపార్టీని వెక్కిరించినంత పని చేశారు. ఇక బీజేపీ కూడా ఇక్కడ చాప చుట్టేసింది.
ఇక అత్యల్పంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో 50 శాతం కంటే కొంచెం తక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ ఆయన 18 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ను కట్టడి చేయగలిగినప్పటికీ… రాష్ట్రంలోనే అత్యధికంగా 35 మంది ఇండిపెండెంట్లు గెలుపొంది సవాల్ విసిరారు.
ఓవరాల్గా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా సగం నియోజకవర్గాల్లో బీజేపీ సున్నాకే పరిమితమైంది. రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. హుజూర్నగర్, ములుగు, మధిర, పాలేరు, ఖమ్మం, చెన్నూరు స్థానాల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోలేకపోయారు.
మంత్రుల నియోజకవర్గాల్లో కొల్లాపూర్, హుస్నాబాద్లలో మాత్రమే కాంగ్రెస్కు బీఆర్ఎస్ నుంచి పోటీ ఎదురైందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీలు కలిపి మంత్రుల నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలగడం విశేషం. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఏకంగా 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా గెలిచింది స్వతంత్రులే. బీఆర్ఎస్ బలపర్చిన వారు స్వతంత్రు లతో పోలిస్తే సగం స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. స్వతంత్రులు ప్ర భావం చూపిన నియోజకవర్గాల్లో మధిర, కొల్లాపూర్, పాలేరు, మంథని, హుస్నాబాద్లు కూడా ఉండడం గమనార్హం. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల్లో సీఎం క్యాబినెల్ సక్సెస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Story By Ramireddy, Big Tv