TELANGANA BYPOLLS RESULTS: తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక 5 ఉపఎన్నికలు జరిగాయి. మునుగోడు ఉపఎన్నికకు ముందు జరిగిన 4 ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ , బీజేపీ చెరో రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. దుబ్బాక , హుజురాబాద్ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. హుజూర్ నగర్, నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
ఉపఎన్నికలు ఎందుకొచ్చాయి?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకలో ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం బీజేపీకి దక్కింది. దుబ్బాక తర్వాత హుజురాబాద్ ఉపఎన్నిక జరిగింది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉపఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం..బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ ఉపఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నికలో నోముల కొడుకు భగత్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
మునుగోడు ఉపఎన్నికకు ముందు
మొత్తంగా చూస్తే మునుగోడు ముందు జరిగిన 4 ఉపఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. టీఆర్ఎస్ రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఈ రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఒక్క నాగార్జున సాగర్ లో మాత్రమే టీఆర్ఎస్ తన స్థానాన్ని నెలబెట్టుకుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు ఉపఎన్నిక జరిగే అవకాశం ఉండదు. కాబట్టే వచ్చే 6 నెలలలోపు మరో ఉపఎన్నిక వచ్చే అవకాశం తక్కువే. అందుకే సాధారణ ఎన్నికల ముందు జరిగిన మునుగోడు ఉపఎన్నిక సెమీస్ ఫైనల్ గా మారింది.