US-Iran War: యుద్ధం మొదలైనప్పుడు ఎవరు విజేతగా నిలుస్తారో తెలియదు. కానీ, రోజులు గడిచేకొద్దీ.. యుద్ధంలో పైచేయి ఎవరు సాధిస్తున్నారో అర్థమవుతుంది. కానీ, కొన్ని యుద్ధాలు విజేత ఎవరో తెలియకుండానే ముగిసిపోతుంటాయ్. ఇప్పుడు.. ఇరాన్-అమెరికా యుద్ధం కూడా అలాగే ఉంది. యుద్ధంలో అప్పర్ హ్యాండ్ తమదేనని, ఇరాన్లో కీలక స్థావరాలన్నింటిని నాశనం చేశామని ట్రంప్ ఎంతో గొప్పగా ప్రకటించారు. అయినాసరే, పూర్తి స్థాయిలో ఇరాన్ని ఓడించలేకపోతున్నారు. చివరికి, ప్రపంచ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న పరిణామాలతో ట్రంప్కి ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఎలాగైనా సరే, ఈ యుద్ధం నుంచి బయటపడాలని చూస్తున్నారు. అందుకే.. చర్చల ప్రస్తావన తెచ్చారనే చర్చ జరుగుతోంది.
ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారాయ్. ట్రంప్ ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యుద్ధాన్ని గెలవలేక, ఓటమిని ఒప్పుకోలేక అగ్రరాజ్యం అధినేత ఎంతో ఇబ్బందిపడుతున్నారు. అమెరికా లాంటి దేశానికి.. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పుడో సవాల్గా మారింది. ఎందుకంటే.. ఇది ఇరాక్, అప్ఘానిస్థాన్ లాంటి యుద్ధం కాదు. ఇరాన్ దగ్గరున్న అడ్వాన్స్డ్ మిసైల్ టెక్నాలజీ, డ్రోన్ల వినియోగం, భౌగోళిక పరిస్థితులు.. అమెరికాని ఇరకాటంలో పడేశాయ్. ముఖ్యంగ్.. ప్రెసిడెంట్ ట్రంప్ని! ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని ఆక్రమించడం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సైన్యానికి తలకు మించిన భారంగా మారింది. ఉన్నఫలంగా యుద్ధం నుంచి వెనక్కి తగ్గితే.. అమెరికా ఓడిపోయిందనే ముద్ర పడుతుంది. ఇది.. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిష్ఠని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా.. తనని తాను ఒక స్ట్రాంగ్ డీల్ మేకర్గా చెప్పుకునే ట్రంప్కు ఇది రాజకీయంగా ఆత్మహత్య లాంటిదనే చెప్పాలి. దాంతో.. యుద్ధాన్ని కొనసాగించలేక, వెనక్కి తగ్గలేక.. చర్చల దగ్గర చిక్కుకుపోయారు ట్రంప్.
మిడిల్ఈస్ట్లో కొనసాగుతున్న ఘర్షణలకు సంపూర్ణ పరిష్కారం కనుగొనే దిశగా సానుకూలమైన చర్చలు జరిగినట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగానే.. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న అన్ని రకాల దాడులను ఓ ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ నిర్ణయం.. ట్రంప్ వెనక్కి తగ్గారనడానికి నిదర్శనమని.. ఇరాన్ సైనికవర్గాలు అన్నట్లు ప్రచారం సాగింది. అయితే, వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చేసిన ప్రకటనని ఇరాన్ విదేశాంగ శాఖ మొదట తిరస్కరించింది.
యుద్ధ లక్ష్యాలను నెరవేర్చుకోకుండా ఎవరితోనూ చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రకటించింది. అంతేకాదు, పశ్చిమాసియాలోని అన్ని విద్యుత్ కేంద్రాలు ఇరాన్ టార్గెట్లో ఉన్నాయని తెలిశాకే.. ట్రంప్ వెనక్కి తగ్గారనే వార్తలు కూడా వచ్చాయ్. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే.. యుద్ధంపై అమెరికా మధ్యవర్తుల నుంచి చర్చలకు సంకేతాలు అందాయని ఇరాన్ తెలిపింది. ట్రంప్ నియమించిన మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈవారం పాకిస్థాన్లో ఇరాన్ అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయ్. చర్చలపై ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన తర్వాత ముడి చమురు ధరలు తగ్గాయ్. స్టాక్ మార్కెట్లు కూడా కోలుకున్నాయ్. ఓ వైపు చర్చల ప్రకటనలు వస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు చేసుకుంటున్నాయ్.
అమెరికా చేస్తున్న ఈ చర్చల ప్రయాత్నాలు.. ఓ సేఫ్ ఎగ్జిట్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదంతా.. శాంతి కోసం కంటే, ఈ గందరగోళం నుంచి బయటపడేందుకేననే విషయం అర్థమవుతోంది. ఏదో ఒక చిన్న ఒప్పందం కుదుర్చుకొని, తానే ఇరాన్ని దారికి తెచ్చుకున్నానని, అమెరికా ప్రజల ముందు, ప్రపంచం ముందు గొప్పలు చెప్పుకునేందుకు ట్రంప్కు ఓ సందర్భం కావాలి. అందుకోసమే.. ఈ ప్రయత్నాలన్నీ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు, ఇరాన్ని లొంగదీసుకోవడం సాధ్యం కాదనే విషయం అమెరికాకు కూడా అర్థమైనట్లే అనిపిస్తోంది. ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థికంగా దెబ్బతిన్నా, ఆ దేశం అగ్రరాజ్యం ముందు మోకరిల్లడం లేదు. దాంతో.. హర్మూజ్ జలసంధిలో ఎదురవుతున్న సవాళ్లు ట్రంప్ని చర్చల వైపు నడిపిస్తన్నాయ్. ఇది.. కేవలం పశ్చిమాసియాలో శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నం కాదు. ఇప్పడున్న పరిస్థితుల్లో.. అనివార్యమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు చెస్ గేమ్లా మారాయ్. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక శక్తితి ఏమాత్రం తలవంచకుండా.. ఇరాన్ గట్టిగా పోరాడుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యుద్ధం మీరు మొదలుపెట్టినా.. ముగింపు మా చేతుల్లోనే ఉంటుందని ఇరాన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వార్ వ్యవహారంలో ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరి అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇరాన్ విషయంలో ఎప్పుడూ కఠినంగా ఉండే ట్రంప్.. ఇప్పుడు యుద్ధం బాధ్యతని తీసుకునేందుకు వెనకాడుతున్నారు.
ఇరాన్పై యుద్ధానికి సంబంధించి.. ట్రంప్ చేస్తున్న రకరకాల ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయ్. యుద్ధం విషయంలో తనపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు.. పక్కవారిపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్పై దాడి చేయమని ముందుగా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పినట్లు.. ట్రంప్ తెలిపారు. ఇరాన్పై మిలటరీ యాక్షన్కి ముందు కొందరు అధికారులతో చర్చలు జరిపానన్నారు. ఇరాన్పై దాడికి ముందుగా పీట్ హెగ్సెత్ మద్దతు తెలిపారన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండొద్దు కాబట్టి, మనం దాడి చేద్దామని ఆయన అన్నారని చెబుతున్నారు. ట్రంప్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయ్.
ఇరాన్తో యుద్ధంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఆసక్తిగా లేరని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు, తమ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ గల్ఫ్ దేశాలన్నింటిని టార్గెట్ చేయడం తమను ఆశ్చర్యపరిచిందన్నారు. దీని గురించి తాము ఆలోచించలేదని తెలిపారు. మరోవైపు.. హర్మూజ్ జలసంధి కూడా అమెరికా గొంతుపై కత్తిలా మారింది. ఈ మొత్తం యుద్ధంలో ఇదే కీలక బిందువుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సప్లై అయ్యే చమురులో దాదాపు 20 శాతం హర్మూజ్ గుండానే వెళ్తోంది. ఇరాన్ ఈ జలసంధిలో నౌకలను ముందుకు కదలనివ్వకపోతే.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయ్. ఈ పరిస్థితుల్లో.. అమెరికా తన నౌకాదళంతో.. ఈ జలసంధిని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయింది. హర్మూజ్ దగ్గర ఇరాన్ దాడులు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయ్.
ఇరాన్పై.. ఎన్ని మిసైల్ దాడులు చేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా.. ఆ దేశం లొంగకపోవడానికి ప్రధాన కారణం వారి డెప్త్ ఆఫ్ రెసిస్టెన్స్. లెబనాన్, యెమెన్, ఇరాక్ లాంటి దేశాల్లో ఇరాన్ మద్దతున్న గ్రూపులు అమెరికా స్థావరాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఎన్ని దాడులు జరిగినా.. దెబ్బతినని రీతిలో ఇరాన్ తన మిసైల్ వ్యవస్థలని భూగర్భంలో భద్రపరుచుకుంది. తమని తాము బాధితులుగా కాకుండా, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి, ముగింపు పలికే శక్తిగా ఇరాన్ ప్రొజెక్ట్ చేసుకుంటోంది. దాంతో.. యుద్ధంపై ప్రపంచం ఆలోచనలు మారుతున్నాయ్. సాధారణంగా, ఏదైనా అంతర్జాతీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ట్రంప్ ముందుంటారు.
కానీ, ఇరాన్ విషయంలో.. ముందడుగు ఏమిటన్నది తెలియకుండా గందరగోళంలో పడిపోయారు. సైనికచర్య చేపట్టి, వారంలోపే ఇరాన్ని దారికి తెచ్చుకోవచ్చని ట్రంప్ భావించారు. కానీ.. వార్ గ్రౌండ్లో సౌండ్ మరోలా ఉంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, చమురు ధరలు కంట్రోల్ తప్పుతాయ్. ఇది, అమెరికా ఆర్థిక వ్యవస్థని కూడా దెబ్బతీస్తుంది. యుద్ధం వల్ల కలిగే నష్టానికి తనే కారణమనే ముద్రపడటం ట్రంప్కు ఇష్టం లేదు. అందుకోసమే, నెమ్మదిగా చర్చల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయ్.
మరోవైపు ఇరాన్ కూడా అమెరికాను ఇరకాటంలో పెట్టేలా చర్చల్లో కీలక ప్రతిపాదనలు ముందుంచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏదేమైనా యుద్ధం ఎప్పుడూ పరిష్కారం చూపదు.. కేవలం వినాశనాన్ని, విధ్వంసాన్ని మాత్రమే మిగిలిస్తుందని మరోసారి రుజువైంది. అమెరికా అంతర్గత రాజకీయ సమీకరణాలన్నీ ఇప్పుడు లెక్క తప్పాయ్. ఇప్పుడు అందరి అటెన్షన్.. అమెరికా-ఇరాన్ మధ్య సాగే చర్చల మీదకే మళ్లుతోంది.
Also Read: మతం మారినట్లు ఎలా నిరూపిస్తారు? కోర్టులు పరిగణనలోకి తీసుకునే సాక్ష్యాలివే!
Story by: Anup, Big Tv