కేసీఆర్ అంతే.. ఎవరేమనుకున్నా… తను ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతాడు. క్యాడర్లో జోష్ ఎప్పుడు పెంచాలో అప్పుడే పెంచుతాడు. ప్రజలకు తన అవసరం ఎప్పుడు ఉందో అనే దానికంటే.. ప్రజలతో తనకెప్పుడు అవసరముందో అప్పుడే ఆయన తన వ్యూహాలకు పదును పెడతాడు.
ఇది ఉద్యమ సమయం నుంచి ఆయనకు అలవాటుగా వస్తున్నదే. అప్పుటి నుంచి కేసీఆర్కు అవమానాలు కొత్త కాదు. ఉద్యమం చల్లబడ్డది. కేసీఆర్ కనిపించడం లేదు. ఇంటికే పరిమితమయ్యాడు. ఇక తెలంగాణ ఉద్యమం అటకెక్కినట్టేనని ఎన్ని ప్రచారాలు చేసినా.. ఎన్ని కవ్వింపు చర్యలకు దిగినా.. తిట్టినా, అరిచినా.. అక్కడి నుంచి మాత్రం స్పందన కరువయ్యేది. చడీచప్పుడు ఉండేది కాదు.
క్యాడర్లో జోష్ తగ్గినప్పుడు, పార్టీ శ్రేణులు నైరాశ్యానికి గురైనప్పుడు.. ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలనుకున్నప్పుడు మాత్రం ఇలా వచ్చి అలా ఓ మీటింగు పెట్టి జోష్ నింపి పోవడమే కేసీఆర్కు తెలుసు. తెలంగాణ యాసలో ..తనదైన శైలిలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదే ప్రయత్నం చేసి.. ఉద్యమం ఆగదు.. తెలంగాణ వచ్చి తీరుతుందనే నమ్మకాన్ని క్యాడర్లో పెంచేలా చేసి జోష్ పెంచడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
అందుకే చాలా మందికి ఆయన అజ్ఞాతవాసం గురించి తెలుసు. ఆయన ఎప్పుడు అలకపాన్పెక్కుతాడో తెలుసు. ఎప్పుడెప్పుడు మౌనం వహిస్తాడో కూడా తెలుసు. జనాలకూ ఇది అలవాటైన చర్యే. అందుకే కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితమైనా పెద్దగా పట్టించుకోలేదు. అయినా అతని గురించి చర్చ ఆగలేదు.
కేసీఆర్ ఉద్యమ సమయం కన్నా ఎక్కువ.. పదేళ్ల పరిపాలన ద్వారా సంక్షేమ పథకాలతో లబ్దిపొందిన సందర్భమే జనాలకు మరింత దగ్గర చేసిందని చెప్పాలి. అందుకే కేసీఆర్ను గుర్తు చేస్తారు కనిపించకపోయినా. ఇది ఎవరూ కాదనలేని ముచ్చట. అజ్ఞాతవాసిగా కేసీఆర్ ఉండటమే నేరంలా అధికారపక్షం ఎన్ని ప్రచారాలు చేసినా.. జనాల ముందు దోషిలా నిలపాలని చూసినా.. ఆయనకుండే క్రేజ్ మాత్రం పెద్దగా తగ్గదనడంలో అతిశయోక్తి కూడా లేదనిపిస్తోంది.
అయితే ఒక్కటే సమస్య. కేటీఆర్కు పూర్తి స్వేచ్చ ఇవ్వడం.. తదుపరి సీఎం అతనే అని కేసీఆర్ డిసైడ్ కావడం.. ఈ ఓడిన కాలాన్ని కేటీఆర్ అనుభవం కోసం వినియోగించే క్రమంలో పార్టీ పగ్గాలన్నీ అతనికే ఇచ్చేసి.. పూర్తిగా బాధ్యత నుంచి తప్పింకున్నట్టుగా ఉండటమే గులాబీ క్యాడర్ను కలవరపెట్టే అంశంగా మారింది. జనాలకు కూడా ఇది మింగుడుపడని విషయంగానే మారింది.
గతంలో ఆయన దేశ రాజకీయాలు చేస్తానని చెప్పినప్పుడు కూడా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక్కడంతా బాగైపోయిందని .. పక్క రాష్ట్రాలకు పోతున్నారా? అనే పెదవి విరుపు అంతటా వచ్చింది. ఇలాంటి చర్యలే కేసీఆర్ను ఓడగొట్టాయి. ఇప్పుడు కేటీఆర్కు సర్వం అప్పగించి … తన బదులు ఇక ఆయనే ఉంటాడు.. ఆదరించండి.. అంటేనే సమస్య మరింత జఠిలమవుతుంది.
ఇది కేసీఆర్కూ తెలుసు. కానీ ఆయనకు తప్పదు. దీని కోసం కన్నబిడ్డెనే దూరం చేసుకున్నాడు. జనాల చర్చ గురించి పట్టించుకుంటాడా?