Repalle Politics: గుంటూరు జిల్లాలో ఇంతవరకు గెలుపు ముఖం చూడని రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయాలని చూస్తోందా? అందుకే ఉన్నట్టుండి అక్కడి నాయకత్వాన్ని మార్చేసిందా? లేడికి లేచిందే పరుగు అన్న చందంగా ఆ కొత్త ఇన్చార్జ్ దూకుడు ప్రదర్శించడానికి కారణాలేంటి? కొత్త నాయకత్వం నియోజకవర్గ వైసీపీ లో జోష్ నింపుతుందా లేదా ఇరకాటంలో పడేస్తోందా? రేపల్లెలో టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టి, వైసీపీ బోణీ కొట్టేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అసలు రేపల్లె సెగ్మెంట్పై జగన్ ఎందుకంత ఫోకస్ పెట్టారు?
రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జుల విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగానే చాలా నియోజకవర్గాల్లో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం ఇన్చార్జ్ని మార్చింది. మాజీ రాజ్యసభ ఎంపీ, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్బై చెప్పడంతో.. ఈవూరు గణేష్కు జగన్ వైసీపీ బాధ్యతలు కట్టబెట్టారు.
మంచి రాజకీయ నేపధ్యం, టీడీపీలో 1994లో మంత్రిగా పనిచేసిన ఈవూరు సీతారావమ్మ తనయుడు, స్థానికంగా బలమైన గౌడ సామాజికవర్గానికి చెందిన ఈవూరు గణేష్ను పక్కనపెట్టి పీటా నాగమోహనకృష్ణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్. పీటాకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన కొద్ది రోజులకే ఆయన పేరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రేపల్లె ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన నియోజకవర్గంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఆ కార్యక్రమానికి వేలాదిగా వైసీపీ కార్యకర్తలు తరలిరావడంతో చాలా రోజుల తర్వాత రేపల్లె లో వైసీపీకు జోష్ వచ్చిందనే టాక్ మొదలయింది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పీటా వ్యవహారం నియోజకవర్గంలో కాంట్రవెర్సీ గా మారిందట..
పీటా నాగమోహనకృష్ణ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నియోజకవర్గంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. బహిరంగ సభ తర్వాత రోజు ఆ ఫ్లెక్సీలను తొలగించారు మున్సిపల్ అధికారులు. దీంతో క్షణాల్లోనే పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకొని నిరసనకు దిగారు. ఆ నిరసనలో పీటా నాగమోహన కృష్ణ కూడా పాల్గొన్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పక్కనే ఉన్న కూటమి నేతల ఫ్లెక్సీలను చించేశారు.. అంతటితో ఆగకుండా సీఐతో వాగ్వాదానికి దిగి.. “ఈసారి మేం వస్తే రప్పా రప్పా నే” అంటూ ఓ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీంతో పీటా తో సహా 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే ఇపుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా డల్ అయింది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. దానికితోడు రేపల్లె నియోజకవర్గంలో గత మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ జెండా ఎగురవేసింది. 2019 లో రాష్టవ్య్రాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి హవా నడుస్తుంటే రేపల్లెలో మాత్రం సైకిల్ రయ్యిమని దూసుకుకొచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. అప్పటి వరకూ రెపల్లె వైసీపీలో బలమైన నాయకుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపాలవడంతో పార్టీను వీడారు. ఇక అప్పటి నుంచి రేపల్లె వైసీపీకు బలమైన నాయకత్వం లేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఈవూరి గణేష్ కూటమి అభ్యర్థి సత్యప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు. గెలిచిన తర్వాత సత్యప్రసాద్ మంత్రి కూడా అయ్యారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ మరింత బలంగా తయారైంది. అందుకే ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలిచి చూపించాలని పక్కా ప్రణాళికలు రచిస్తోందంట వైసీపీ.
టీడీపీ ఆవిర్భావం తర్వాత రేపల్లెల్లో కాంగ్రెస్ మూడు సార్లు మాత్రమే గెలిచింది. ఇక వైసీపీ అయితే ఇంతవరకు బోణీ కూడా కొట్టలేదు. అనగాని సత్యప్రసాద్ వరుసగా మూడో సారి గెలిచి వైసీపికి ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే వస్తున్నారు. అలా టీడీపీకి కంచుకోటలా తయారైన రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ గెలవాలి అంటే అంతే బలమైన నాయకత్వాన్ని బరిలో దించాల్సి ఉంటుంది. అయితే ఆ విషయంలో వైసీపీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుందనే చెప్పాలి. 2024 లోనే అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి వైసీపీ అనేక ప్రయత్నాలు చేసి విఫలమైంది.
గత ఎన్నికల్లో మాజీ మంత్రి విడదల రజనీతో సహా పలువురు వైసీపీ ముఖ్య నాయకుల పేర్లు వినిపించినా ఏవీ ఫైనల్ కాలేదు. దీంతో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఈవూరు గణేష్ కు టికెట్ ఇచ్చి చేతులు కాల్చుకుంది వైసీపీ. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవూరు గణేష్ పార్టీతో అంటీఅంటనట్టుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరుకాకపోవడంతో నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీ పూర్తిగా చతికిలబడినంతపనైంది. దీంతో రేపల్లె నియోజకవర్గ వైసీపీకి రిపేర్ లు మొదలు పెట్టింది పార్టీ అధిష్టానం.
ఈ నేపథ్యంలో రేపల్లె నియోజకవర్గంలో అప్పటి వరకూ ఉన్న ఈవూరు గణేష్ ను తప్పించి ఆ బాధ్యతలు పీటా నాగమోహన కృష్ణకు అప్పగించారు అధినేత జగన్. అయితే పీటా ఇంచార్జి గా వచ్చి కొన్ని రోజులకే ఆయన పేరు నియోజకవర్గంలో వివాదాస్పదంగా మారడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలయింది. పీటా దూకుడు చూసి రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ కు బుద్ధి చెప్పడానికి సరైన నాయకుడు వచ్చాడని పీటా అభిమానులు, పలువురు వైసీపీ కార్యకర్తలు అంటుంటే.. ఇలా దూకుడుగా వెళ్తే పార్టీకే నష్టం అని వైసీపీలోనే మరోవర్గం పెదవివిరుస్తున్నారట.
ఇప్పటికే ఈ ఫ్లెక్సీల వ్యవహారం పై మంత్రి అనగాని కూడా స్పందించారు. ప్రశాంతంగా ఉన్న రేపల్లె నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని, రప్పా రప్పా రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేపల్లె వైసీపీ ఇంచార్జిగా వచ్చిన పీటా నాగ మోహనకృష్ణ పార్టీ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఎలా బలోపేతం చేస్తారు? ఈ ఘటన తర్వాత కూడా అదే దూకుడు ప్రదర్శిస్తారా? ఒకవేళ అదే స్పీడ్ ఉంటే పీటాకు పార్టీ కేడర్ ఎంత వరకూ అండగా ఉంటుంది? రేపల్లె లో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి పీటా పీఠమెక్కగలరా? అన్న అంశాలు చర్చకు దారితీస్తున్నాయి. మొత్తమ్మీద వచ్చే ఎన్నికల వరకు పీటానే వైసీపీ అభ్యర్ధిగా ఉంటారా? అన్నది కూడా వైసీపీ శ్రేణుల్లోప్రశ్నార్ధకంగా మారిందంట.
Also Read: కొత్త పెళ్లి కొడుకు అబద్ధాలు చెప్పిండు.. మల్లారెడ్డి పై శ్రీధర్ బాబు జోకులు
Story by: Apparao, Big Tv