Balineni Vs Buchepalli: ఆ జిల్లాలో జిల్లా పరిషత్ పీఠాన్నీ జనసేన కైవసం చేసుకోవాలనుకుంటుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ జనసేనలోని ఓ కీలక నేత బహిరంగంగా ప్రకటించేశారు. అయితే ఒక్క జడ్పిటీసీ లేని జనసేన, జడ్పీపీఠాన్నీ ఎలా కైవసం చేసుకోగలగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. పోనీ ఆ కీలకనేత తమాషాగా మాట్లడే వ్యక్తా అంటే అది కాదు. మరి జనసేన వైసీపీ చేతిలో ఉన్న జడ్పీ పీఠాన్ని ఎలా దక్కించుకుంటుంది? అసలు దానికి సంబంధించి ఆ జిల్లాలో జరుగుతున్న చర్చేంటి?
ప్రకాశం జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న బాలినేని
ప్రకాశం జిల్లా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నామని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జడ్పీ ఛైర్ పర్సన్, వైసీపీ నాయకురాలు బూచేపల్లి వెంకాయమ్మ స్వయంగా బాలినేని పై నిప్పులు చెరిగారు. దమ్ముంటే జిల్లా పరిషత్ కుర్చీని టచ్ చేసి చూడండని సవాల్ విసిరారు. దీంతో బాలినేని, వైసీపీల మధ్య జడ్పీ వార్ పీక్ స్టేజ్కి చేరినట్లైంది.
జనసేన సభలో జడ్పీ పీఠంపై చాలెంజ్ చేసిన బాలినేని
ఇటీవల జరిగిన జనసేన అవిర్భావ సభలో ప్రకాశం జిల్లా పాలిటిక్స్లో సినీయర్ నేతగా ఉన్న మాజీమంత్రి బాలినేని మాట్లాడారు. అయితే మొదట జగన్పై విమర్శలు ఎక్కు పెట్టిన బాలినేని తర్వాత జిల్లా పరిషత్ పీఠంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళాణ్ ఓకే అంటే ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను గద్దె దించుతానని కామెంట్ చేశారు. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. జగన్ పై మాట్లాడినందుకే ఒకపక్క ఫ్యాను పార్టీ నేతలు నిప్పులగుండంలా రగిలిపోతుంటే, జడ్పీ పీఠం గురించి మాట్లాడేసరికి ఒక్కసారిగా బాలినేని పై బ్లాస్ట్ అవుతున్నారు. వరుస ప్రెస్ మీట్లతో బాలినేనిపై విరుచుకుపడటం మొదలు పెట్టారు.
జడ్పీటీసీలు బాలినేనికి టచ్లోకి వస్తున్నారా?
బాలినేని ఏ ప్లాన్ లేకుండానే బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరని.. కొంత మంది జడ్పీటీసీలు బాలినేని టచ్లోకి వెళ్లినట్లు గుసగుసలు వినపడుతున్నాయి.. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకు చెందిన 20 మంది కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కోఆప్షన్ సభ్యులను జనసేనలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే జడ్పిటీసీలతో కూడా తెరవెనుక మంతనాలు జరిపి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పలువురు జడ్పీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్దంగా ఉన్నారనే టాక్ కూడా జిల్లాలో వినపడుతోంది. ఆ ధీమాతోనే బాలినేని జడ్పీ పీఠంపై బహిరంగంగా మాట్లాడారంటున్నారు.
జగన్ మళ్లీ భారీ మెజార్టీతో సీఎం అవుతారని వెంకాయమ్మ జోస్యం
మరోవైపు బాలినేని వర్గం కూడా త్వరలోనే జిల్లా పరిషత్ పై జనసేన జెండా ఎగిరేస్తామని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఆ వ్యాఖ్యలను జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సహా వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. బాలినేనికి జడ్పీ చైర్మన్ సీటును కూడా టచ్ చేయలేరని సవాళ్లు విసరుతున్నారు. జడ్పీ సభ్యులందరు వైసీపీలోనే కొనసాగుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు ఈ సందర్భంగా వెంకాయమ్మ 2029లో జగన్ 151 సీట్ల కంటే ఎక్కువ మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్తుండటం గమనార్హం.
కూటమి శ్రేణులు మరో డౌట్ వ్యక్తం
మరోవైపు ఇక్కడే కూటమి శ్రేణులు మరో డౌట్ వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే ఒంగోలు కార్పోరేషన్ ను తెలుగుదేశం పార్టీ తన అధీనంలోకి తెచ్చుకుంది. ఆ క్రమంలో జిల్లా పరిషత్ పీఠాన్ని మిత్రపక్షమైన జనసేన దక్కించుకునే ప్రయత్నం చేస్తే టీడీపీ నేతాలు సైలైంట్ గా ఉంటారా? అన్నది ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. ఎందుకంటే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్కు బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే రాజకీయ మంటలు రాజుకుంటుంటాయి. ఈ టైంలో బాలినేని జడ్పీలో ఆధిపత్యం కొనసాగిస్తే తనకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనేది దామచర్ల ఇన్నర్ ఫీలింగ్ అంటున్నారు.
వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకాయమ్మ కుమారుడు శివప్రసాద్ రెడ్డి
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 55 మంది జడ్పీ సభ్యులున్నారు. అందరూ వైసీపీ వారే అవ్వడం గమనార్హం. అందులో ముగ్గురు తర్వాత కాలంలో మృతి చెందారు. మరో నలుగురు ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయ్యారు. అయినప్పటికి వైసీపీకి ఇంకా 48 మంది జడ్పీటీసీల బలం ఉంది. . జడ్పీ పీఠం దక్కించుకోవాలంటే 28మంది సభ్యుల మద్దతు సరిపోతుంది. అయినా జడ్పీ పీఠాన్ని జనసేన హస్తగతం చేసుకోవడం అంతా ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందులోనూ జిల్లా పరిషత్ పీఠం బూచేపల్లి కుటుంబం చేతిలో ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా వెంకాయమ్మ కుమారుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డే ఉన్నారు.
అవిశ్వాసం పెట్టడానికి తొలగిన అడ్డంకి
ప్రభుత్వం మారిన దగ్గర నుండి శివప్రసాద్ రెడ్డి తన తల్లి పదవిని కాపాడుకోవడానికి,, జడ్పీ సభ్యుల మీద చూపించే కేర్ మరింత పెరిగిందంట. ఎప్పిటికప్పుడు వారితో టచ్లో ఉంటూ వారిని మానిటరింగ్ చేసుకుంటున్నారంట. ఈ పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్కు సరిపడా సభ్యులు జనసేన వైపు రావడం అంటే కష్టమనే అంటున్నారు. ఇటీవల బాలినేని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మరింత అలెర్ట్ అయిన పరిస్ధితి కనపడుతోంది. అదలా ఉంటే జడ్పీ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టేందుకున్న నాలుగేళ్ల ఆర్డినెన్స్ అడ్డంకి కూడా ఇప్పడు తొలగిపోయింది. ఈ నేపధ్యంలో జడ్పీ పీఠం కైవసం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ ఓకే అంటారా? ఒకవేళ ఓకే అన్నా బాలినేని తాను ఛాలెంజ్ చేసినట్లు.. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన సభ్యులను పార్టీలోకి తీసుకురాగాలరా? అన్నది జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.