EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మరో కీలక సంస్కరణకు త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఈపీఎఫ్ఓ జీతం పరిమితి పెంపు ప్రతిపాదనను కేద ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ప్రస్తుతం బేసిక్ వేతన రూ.15,000 వరకు ఉన్న వారికి పీఎఫ్ కవరేజీ కల్పిస్తున్నారు. ఈ పరిమితిని రూ.25,000కు పెంచే ప్రతిపాదనపై కేంద్రం సమాలోచన చేస్తుంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే కోటి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్, ఈపీఎస్ కవరేజీలోకి రానున్నారు. చివరిగా 2014లో వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000లకు సవరించారు.
ప్రస్తుత ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. బేసిక్ శాలరీలో రూ.15,000 వరకు కలిగిన ఉన్న ఉద్యోగులు పీఎఫ్ పథకంలో నమోదు చేసుకోవాలి. అయితే ఈ మొత్తానికి మించి సంపాదించే వారిని యజమాని నిర్ణయం మేరకు మినహాయించవచ్చు. ఈపీఎఫ్ అర్హత పరిమితిని రూ.25,000 పెంచితే ప్రైవేట్ ఉద్యోగులకు చాలా మేరకు ప్రయోజనం కలగనుంది.
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం. నాగరాజు మాట్లాడుతూ.. ప్రస్తుత పీఎఫ్ పరిమితి కంటే కొంచెం ఎక్కువ సంపాదించే ఉద్యోగులు తరచుగా పెన్షన్ ప్రయోజనాలు కోల్పోతున్నారన్నారు. ఆధునిక వేతన స్థాయిలు, పెరుగుతున్న జీవన వ్యయాన్ని ప్రతిబింబించేలా దశాబ్దాల నాటి నియమాలను అప్డేట్ చేయాలని ఆయన చెప్పారు. ఈపీఎస్ పెన్షన్ కవరేజీ విస్తరణకు ఆయన వ్యాఖ్యలు బలపరచనున్నాయి.
ఈపీఎఫ్ఓ ప్రతిపాదనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పరిమితిపై రూ.10,000 అదనంగా పెంచడం వల్ల ఒక కోటి మందికి పైగా అదనపు కార్మికులు ఈపీఎఫ్ఓ పథకాల పరిధిలోకి తీసుకురావచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. 2025 పీఎఫ్ సంస్కరణలో ఇది ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుత రూ.15,000 పరిమితి ద్రవ్యోల్బణం లేదా నేటి జీతాల నిర్మాణాలకు సరిపోదని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా చెబుతున్నాయి. చాలా మంది కార్మికులకు ఇప్పటికీ దీర్ఘకాలిక పొదుపు మార్గాలు లేవని ఉంటున్నారు. పీఎఫ్ పరిమితి పెరగడం వల్ల సహజంగానే ఎక్కువ మంది ఉద్యోగులను అధికారిక సామాజిక భద్రత ఏర్పడుతుందని అంటున్నారు.
ఈ నిబంధన అమలు అయితే ఉద్యోగులు, యజమానులకు నెలవారీ జమ పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఇద్దరూ పీఎఫ్ ఖాతాలకు ప్రాథమిక జీతంలో 12% వాటాను జమ చేస్తున్నారు. కొత్త పరిమితితో ఈ సహకార మొత్తం పెరగనుంది. దీనివల్ల ఉద్యోగులు పెద్ద మొత్తంలో పదవీ విరమణ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అయితే, యజమానులు కూడా తమ వాటాను పెంచాల్సి ఉంటుంది.
Also Read: Gold Rate Increased: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా!
నేటికి ఈపీఎఫ్ఓ సుమారు రూ.26 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. దాదాపు 7.6 కోట్ల యాక్టివ్ పీఎఫ్ చందాదారులను కలిగి ఉంది. జీతం పరిమితిని రూ.25,000లకు విస్తరించడం వల్ల ఈపీఎఫ్ఓ కవరేజ్ గణనీయంగా పెరుగుతుంది.