Income Tax Misreporting: మీ ఆదాయాన్ని తప్పుగా చూపించినా, పన్నులు సకాలంలో చెల్లించకపోయినా.. భారీ జరిమానాలు విధిస్తారు. ఇలాంటి కేసులను పరిష్కరించడానికి చట్టంలో ప్రత్యేక విధానాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 221 పన్ను చెల్లింపులో లోపాల గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 270A ఆదాయాన్ని తక్కువగా చూపించడం, తప్పుగా చూపించడం వంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేస్తుంది. ఈ రూల్స్ ప్రకారం ఎంత ఫైన్ విధిస్తారు, జరిమానాలు పడితే పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం.
అధికారులు నిర్దేశించిన మొత్తాన్ని 30 రోజుల్లోగా లేదా జాయింట్ కమిషనర్ విధించిన వ్యవధిలోగా ఆదాయపు పన్ను చెల్లించాలి. అలా చెల్లించకపోతే వారిని డిఫాల్ట్ అసెస్సీగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఆదాయపు పన్నుపై వడ్డీ, జరిమానా విధిస్తారు. అప్పటికీ వడ్డీ, జరిమానా కట్టకపోతే వ్యక్తి.. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వసూలు చర్యలు ప్రారంభిస్తారు. బ్యాంకు అకౌంట్ సీజ్ చేయడం, బ్యాంకు అకౌంట్ నుంచి నేరుగా వసూలు చేయడం, ఆస్తులను జప్తు వంటి యాక్షన్ తీసుకోవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 220(2), 221 కింద పన్ను చెల్లిండంలో విఫలమైతే ఫైన్ విధిస్తారు.
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం సెక్షన్ 220(2), 221 ఇప్పుడు సెక్షన్లు 411, 412గా మారాయి. చెల్లించని పన్ను డిమాండ్లపై వడ్డీ, జరిమానా నిబంధనల్లో ఎలాంటి ముఖ్యమైన మార్పులు చేయలేదు.
ఆదాయాన్ని తక్కువగా చూపించడం అంటే, పన్ను అధికారులు అంచనా వేసిన దానికంటే.. తక్కువ ఆదాయాన్ని ప్రకటించడం. కొన్ని విషయాలు దాచిపెట్టడం, తప్పుడు వాదనలు లేదా పన్ను లెక్కగట్టడంలో తప్పుల కారణంగా జరుగుతుంది. ఆదాయాన్ని తప్పుగా చూపించడం అంటే.. ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టడం. లెక్కల్లో ఆదాయాన్ని చూపించకపోవడం, తప్పుడు ఖర్చులను క్లెయిమ్ చేయడం లాంటివి. అకౌంట్ బుక్స్ లో తప్పుడు లెక్కలు, రసీదులు ఇవ్వకపోవడం, అంతర్జాతీయ లావాదేవీలను రిపోర్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం ఆదాయాన్ని దాచడం కిందకు వస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఆదాయాన్ని దాటిన వారిపై భారీ జరిమానాలు విధించవచ్చు.
ఆదాయాన్ని తక్కువగా చూపించడం లేదా తప్పుగా చూపించడం వలన భారీ జరిమానాలు విధిస్తారు. కొత్త ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 439లో ఈ రూల్స్ ను పేర్కొన్నారు. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తే.. చెల్లించాల్సిన పన్నులో 50% జరిమానా విధించవచ్చు. ఆదాయాన్ని తప్పుగా చూపిస్తే.. చెల్లించాల్సిన పన్నుపై 200% జరిమానా విధించవచ్చు. పన్నులు ఎగవేతదారులకు ఆదాయపు పన్ను శాఖ శిక్షలు కూడా విధించవచ్చు.
Also Read: డిజిటల్ వినియోగదారులకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం!
అయితే కొన్ని పరిస్థితులలో జరిమానాను మాఫీ చేస్తారు. ఆదాయాన్ని తక్కువగా చూపించిన సందర్భాల్లో ఫైన్ నుంచి మినహాయింపు కోరేందుకు ఓ అవకాశం ఉంది. ఈ మినహాయింపు పొందాలంటే పన్ను చెల్లింపుదారుడు పన్ను, దానిపై వడ్డీని పూర్తిగా చెల్లించాలి. అసెస్మెంట్ ఆర్డర్ పై అప్పీల్ చేయకూడదు. అసెస్మెంట్ ఆర్డర్ వచ్చిన నెల చివరి తేదీ నుంచి ఒక నెలలోపు జరిమానా మాఫీ కోసం అప్లై చేసుకోవచ్చు. పాత పన్ను చట్టంలోని సెక్షన్ 270AA, కొత్త పన్ను చట్టంలోని సెక్షన్ 440 ప్రకారం ఈ కవరేజీ లభిస్తుంది. 2026 బడ్జెట్తో తప్పుడు రిపోర్టింగ్ కేసుల నుంచి మినహాయింపు పొందేందుకు అవకాశం కల్పించింది కేంద్రం. దీని కోసం పన్ను చెల్లింపుదారులు 100% అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, కట్టాల్సిన పన్ను రూ.10 లక్షలు అయితే, గతంలో దానిపై 200% అంటే రూ. 20 లక్షలు ఫైన్ విధించేవారు. ఇలాంటప్పుడు ట్యాక్స్ పేయర్ రూ.10 లక్షలను పన్నుగా చెల్లించి, జరిమానాలో 100 శాతం అంటే రూ.10 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది.