లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వానికి మహిళా సాధికారతపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ పరిణామం మరోసారి నిరూపించిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆమె ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంలోని అధికార పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఎండగట్టారు.
మహిళా బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం వల్లే అది లోక్సభలో వీగిపోయిందని కవిత విశ్లేషించారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన కంటే రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశమే బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెస్తే ప్రతిపక్షాలు కచ్చితంగా అడ్డుకుంటాయనే విషయం తెలిసినప్పటికీ బీజేపీ కావాలనే కుట్రపూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఈ వ్యూహం వెనుక మహిళా కోటాను అడ్డుకోవాలనే ఆలోచన దాగి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
గతంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి దానిని సెన్సెస్ (జనగణన)కు లింక్ చేశారని కవిత గుర్తు చేశారు. అప్పుడు ఒకరకమైన ఆశలు కల్పించి ఇప్పుడు 2011 సెన్సెస్ ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం మహిళలను మరోసారి వంచించడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మహిళలకు ఒరిగేదేమీ లేదని పైగా ఇది పెద్ద మోసమని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆడబిడ్డలు బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ మాయాజాలాన్ని గమనించాలని కవిత కోరారు. మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఒక ధైర్యవంతురాలైన మహిళా నాయకత్వం వహిస్తున్నారని అక్కడ బీజేపీని ఓడించి ఆ మహిళా శక్తిని గెలిపించాలని కోరారు. బెంగాల్లో ఉన్న స్నేహితులకు.. బంధువులకు ఫోన్ చేసి మరి బీజేపీ మోసాలను వివరించాలని ఆమె సూచించారు.
మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఆడుతున్న నాటకాలు ఇక సాగవని కవిత హెచ్చరించారు. ప్రతిపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి బిల్లును వ్యతిరేకించాయంటే దానికి కారణం బీజేపీ ప్రవేశపెట్టిన నిబంధనలేనని ఆమె వివరించారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి మహిళా కోటాపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు.
ALSO READ: లోక్సభలో వీగిపోయిన మహిళా బిల్లు.. ప్రజాస్వామ్య విజయం అన్న సీఎం రేవంత్ రెడ్డి!