2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడమే పరమావధిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక, సామాజిక దృక్పథాన్ని నిర్దేశించేందుకు ఈ పద్దులో ఆమె ‘మూడు ప్రాథమిక కర్తవ్యాలను’ ప్రకటించారు. కేవలం అంకెలే కాకుండా దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసేలా ఈ బడ్జెట్ రూపొందించబడింది.
మూడు కర్తవ్యాల ఫ్రేమ్వర్క్..
ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో మూడు ప్రధాన బాధ్యతలను వివరించారు. మొదటిది ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, సుస్థిరపరచడం. గ్లోబల్ మార్కెట్లలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకుంటూనే, ఉత్పాదకతను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండవది.. ప్రజల ఆకాంక్షలు, సామర్థ్య పెంపు. పౌరులను కేవలం లబ్ధిదారులుగా కాకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మార్చేందుకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. మూడవది.. అవకాశాల కల్పనలో సమన్యాయం. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తితో ప్రతి ప్రాంతం, ప్రతి వర్గానికి వనరులు అందేలా చూడటం ఈ కర్తవ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
1. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, సుస్థిర పరచడం
2. ప్రజల ఆకాంక్షలు, సామర్థ్య పెంపు..
3. అవకాశాల కల్పనలో సమన్యాయం
ఆర్థిక క్రమశిక్షణ – గణాంకాలు..
ఈ బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేశారు. కోశ లోటును (Fiscal Deficit) జీడీపీలో 4.3 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఇది 4.4 శాతంగా ఉంది. మొత్తం స్థూల పన్ను రాబడి రూ.44.04 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా వేయగా.. ఇందులో ఆదాయపు పన్ను రూ.14.66 లక్షల కోట్లు, కార్పొరేట్ పన్ను రూ.12.31 లక్షల కోట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నామినల్ జీడీపీ వృద్ధి రేటు 10 శాతంగా ఉంటుందని, తద్వారా మొత్తం జీడీపీ రూ.393 ట్రిలియన్లకు చేరుకుంటుందని బడ్జెట్ అంచనా వేసింది.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట..
మోదీ ప్రభుత్వ ఆర్థిక వ్యూహంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన ఇంజిన్గా నిలుస్తోంది. ఈసారి నేరుగా మూలధన వ్యయం కోసం రూ.12.22 లక్షల కోట్లను కేటాయించారు. ఇది గత ఏడాది కంటే 11.5 శాతం ఎక్కువ. అయితే, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లను కూడా కలిపితే ‘ప్రభావవంతమైన మూలధన వ్యయం’ ఏకంగా రూ.17.15 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దేశ జీడీపీలో 4.4 శాతానికి సమానం.
రెవెన్యూ వ్యయం (వినియోగం) తగ్గించి, ఆస్తుల సృష్టిపై దృష్టి పెట్టడం ద్వారా వ్యయ నాణ్యత పెరిగిందని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. స్థిరమైన రుణ ప్రణాళికతో మార్కెట్ నుండి రూ.11.73 ట్రిలియన్ల స్థూల రుణాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి, ఈ బడ్జెట్ అటు సామాన్యుల ఆకాంక్షలను, ఇటు ఆర్థిక సుస్థిరతను సమతుల్యం చేస్తూ 2047 వైపు అడుగులు వేస్తోంది.