Huzurabad District: ఒకప్పుడు ఆయకట్టు రైతులకు వరప్రదాయినిగా ఉన్న చెరువు.. నేడు ఆక్రమణదారుల చేతుల్లో చిక్కి విలవిలలాడుతోంది. కళ్లముందే పిల్ల కాలువలు మాయమవుతున్నా, సాగునీరు గల్లంతవుతున్నా నీటి పారుదల శాఖ (Irrigation Department) అధికారులు పట్టించుకోకపోవడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వీణవంక మండలం కనపర్తి గ్రామ పరిధిలోని కొంతకుంట చెరువు సుమారు 50 ఎకరాల సాగు భూమికి ప్రధాన నీటి వనరు. గతంలో పెద్ద కాలువల ద్వారా చెరువులోకి నీరు చేరి, అక్కడి నుంచి పిల్ల కాలువల ద్వారా పొలాలకు పారేది. కానీ, గత కొంతకాలంగా కొందరు స్వార్థపరులు కావాలని కాలువలకు గండ్లు కొట్టడం, మట్టితో పూడ్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో చెరువుకు చేరాల్సిన నీరు మధ్యలోనే వృథాగా పోతోంది.
Also Read: BRS Party: శామీర్పేట్లో కేసీఆర్కు ఘన స్వాగతం.. సిట్ నోటీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన!
వేసవి కాలం రాకముందే చెరువులో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. కాలువలు ధ్వంసం కావడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. “ప్రభుత్వ నిధులతో నిర్మించిన కాలువలు కళ్లముందే నాశనమవుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణం” అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు నీరు లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని, తమ కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వారు వాపోతున్నారు.
ఏళ్ల తరబడి రైతులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారుల నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమా? లేక ఆక్రమణదారులకు వారి మౌన సహకారం ఉందా? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చెరువు కాలువల ధ్వంసం వల్ల భూగర్భ జల మట్టం కూడా పడిపోతోందని గ్రామ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని కనపర్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్షణ చర్యలు గా ధ్వంసమైన పిల్ల కాలువలను వెంటనే పునరుద్ధరించాలి . కాలువలకు గండ్లు కొట్టి, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని చెరువులోకి నీరు చేరేలా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలి.లేనిపక్షంలో ‘కొంతకుంట’ చెరువు కేవలం కాగితాలకే పరిమితమై, పంట భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు.