కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రతిపాదనలు సావరీన్ గోల్డ్ బాండ్ల (SGB) మదుపర్లకు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేసిన వారికి ఇకపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు లభించదు. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇది సెకండరీ మార్కెట్లో బాండ్లు కొనుగోలు చేసిన వారి లాభాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం.
గత కొన్నేళ్లుగా ఎస్జీబీలు భారత్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాలుగా ఉన్న విషయం తెలిసిందే. ఏడాదికి 2.5 శాతం వడ్డీతో పాటు, మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభాలపై పూర్తి పన్ను మినహాయింపు ఉండటం వీటి ప్రత్యేకత. గతంలో ఈ బాండ్లను ఆర్బీఐ నుంచి నేరుగా కొన్నా లేదా స్టాక్ మార్కెట్లో ఇతరుల నుంచి కొనుగోలు చేసినా.. మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే లాభాలపై ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, తాజా బడ్జెట్ ఈ వెసులుబాటుకు గండి కొట్టింది.
కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఆర్బీఐ ప్రాథమిక జారీ సమయంలో నేరుగా సబ్స్క్రయిబ్ చేసుకుని, మెచ్యూరిటీ వరకు వాటిని అట్టిపెట్టుకున్న అసలు మదుపర్లకు మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అలా కాకుండా, స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా సెకండ్ హ్యాండ్ లో బాండ్లు కొన్నవారు, మెచ్యూరిటీ సమయంలో వచ్చే ధర వ్యత్యాసంపై ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ పన్ను ప్రయోజనం కేవలం ఒరిజినల్ సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం కానుంది.
సెకండరీ మార్కెట్లో తక్కువ ధరకు లభించే పాత బాండ్లను కొనుగోలు చేసి, మెచ్యూరిటీ సమయంలో పన్ను లేని లాభాలను పొందుతున్న ఆర్బిట్రేజ్ మదుపర్లను అడ్డుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రాథమిక మదుపర్లకు, ట్రేడర్లకు మధ్య సమానత్వం తీసుకురావడానికే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ నిర్ణయంపై మార్కెట్ నిపుణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యాపిటల్ మైండ్ సీఈఓ దీపక్ షెనాయ్ వంటి నిపుణులు దీనిని సెకండరీ మార్కెట్ కొనుగోలుదారులకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
ఫలితంగా.. సెకండరీ మార్కెట్ ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసే వారికి ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్లతో పోలిస్తే ఉండే అదనపు పన్ను ప్రయోజనం ఇకపై ఉండదు. ప్రాథమిక మదుపర్లకు మాత్రం ఎలాంటి మార్పు లేదు. వారు ఆర్బీఐ విండో ద్వారా బాండ్లను వెనక్కి ఇచ్చినా లేదా మెచ్యూరిటీ వరకు వేచి ఉన్నా పాత నిబంధనలే వర్తిస్తాయి. కానీ, ఎక్స్ఛేంజ్లో బాండ్లు కొని ఏప్రిల్ 1, 2026 తర్వాత లాభాలు పొందే వారు మాత్రం పన్ను లెక్కలు వేసుకోవాల్సిందే.