LPG New Rules 2026: ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం.. దేశంలో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఎల్ పీజీ సిలిండర్ సరఫరాలో అనిశ్చితి తలెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎల్పీజీ సరఫరాలో నెలకొన్న కొన్ని లోటు పాట్లు సైతం బయటపడ్డాయి. దీనిని గమనించిన కేంద్రం ప్రభుత్వం.. కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. మే 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీకి సంబంధించి ఈ నయా రూల్స్ అమల్లోకి సైతం వచ్చేశాయి. ఈ నిబంధనలను ప్రతీ ఒక్క ఎల్ పీజీ (LPG) యూజర్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మే 1వ తేదీ నుంచి ‘వన్ హౌస్హోల్డ్ – వన్ కనెక్షన్’ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ నిబంధన ప్రకారం మీ ఇంట్లో ఇప్పటికే పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉంటే.. ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ను తప్పనిసరిగా వదులుకోవాలి. తాజా నిబంధనల ప్రకారం.. రెండు కనెక్షన్లు కలిగి ఉండటం ఇకపై నిబంధనలకు విరుద్ధం. పీఎన్ జీ కనెక్షన్ ఉన్నవారికి గ్యాస్ ఏజెన్సీలు రీఫిల్స్ సరఫరా చేయవని అధికార వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే దేశంలోని సుమారు 43,000 మంది తమ ఎల్ పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకోవడం విశేషం.
గ్యాస్ సిలిండర్ సరఫరాలో మరింత పారదర్శకత తీసుకొచ్చే ఉద్దేశంతో మే1వ తేదీ నుంచి డిజిటల్ వెరిఫికేషన్ పద్దతిని కేంద్రం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సిలిండర్ బుక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మెుబైల్ నెంబర్ కు డెలివరి అథెంటికేషన్ కోడ్ (DAC) కూడ్ పేరిట ఓ OTP నెంబర్ వస్తుంది. సిలిండర్ తీసుకొని డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ కోడ్ ను అతడికి చెప్పాల్సి ఉంటుంది. ఒకప్పటిలా పాత రసీదులు, బ్లూ బుక్ చూపించి సిలిండర్ తీసుకోవడం మే 1వ తేదీ నుంచి కుదరదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కాబట్టి పొరపాటున ఓటీపీ మెసేజ్ ను డిలీట్ చేస్తే.. గ్యాస్ సిలిండర్ పొందటం అసాధ్యం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బుకింగ్ విషయంలో ఒక సిలిండర్ కు మరొక సిలిండర్ మధ్య ఉండాల్సిన గ్యాప్ ను సైతం మే 1వ తేదీ నుంచి పెంచేశారు. కొత్త నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ తీసుకున్న రెండోది బుక్ చేయడానికి కనీసం 25 రోజుల వ్యవధి తప్పనిసరి. గతంలో ఇది 21 రోజులుగా ఉండటం గమనార్హం. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ గ్యాప్ ఏకంగా 45 రోజుల వరకూ ఉంది. మరోవైపు ఉజ్వల పథకం లబ్దిదారులు.. తప్పనిసరిగా ఆధార్ ఈకేవైసీ (Aadhaar eKYC) పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. లేదంటే సబ్సిడీ ఆగిపోయే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: హైదరాబాద్లో సరికొత్త టెక్నాలజీ.. ఏసీ, కూలర్ లేకుండానే కూలింగ్.. ఇదేదో భలే ఉందే!
గత కొద్ది రోజులుగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మే 1వ తేదీన కూడా మరోమారు భారీగా ధరలు పెరిగాయి. దిల్లీ వంటి నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.993 పెరిగింది. ఫలితంగా 19 కేజీల సిలిండర్ ధర రూ.3,071.50 కు చేరింది. మరోవైపు గృహ అవసరాల కోసం సామాన్యులు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. దిల్లీలో రూ.913 వద్ద సిలిండర్ ధర కొనసాగుతోంది. హైదరాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్ ధర సుమారు రూ.965గా ఉండటం గమనార్హం.
Also Read: రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!