India NZ FTA: ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో భారత్, న్యూజిలాండ్ సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్క్లే సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక ప్రయాణంలో నిర్ణయాత్మక మైలురాయిగా పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఈ ఒప్పందం తొమ్మిది నెలల్లోనే కుదిరిందని, ఇరు దేశాల పరస్పర విశ్వాసం, ఉమ్మడి లక్ష్యాలను ప్రతిబింబిస్తుందని ఆయన తెలియజేశారు.
ఈ ఒప్పందంతో న్యూజిలాండ్కు ఎగుమతి చేసే ఉత్పత్తులపై 100% సుంకాల మినహాయింపు ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ ప్రయోజనాలను కాపాడుతూనే, ఎంఎస్ఎంఈలు, రైతులు, మహిళలు, యువత, నిపుణులు, వివిధ రంగాలకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం దేశంలోకి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సులభతరం చేస్తుందన్నారు. వాణిజ్యం, సేవలు, పెట్టుబడి, ఆవిష్కరణ, రవాణా, వ్యవసాయ, విద్య రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందన్నారు.
ఈ అగ్రిమెంట్ అన్ని టారిఫ్ లైన్లను కవర్ చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. వస్త్రాలు, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ప్రాసెస్ చేసిన ఫుడ్ రంగాలలో పోటీతత్వాన్ని పెంచి ఎంఎస్ఎంఈలకు ఊతం ఇస్తాయన్నారు. న్యూజిలాండ్ గతంలో సిరామిక్స్, కార్పెట్లు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలతో సహా కీలకమైన భారతీయ ఎగుమతులపై 10 శాతం వరకు గరిష్ట సుంకాలను కొనసాగించిన విషయం తెలిసిందే.
భారత్ లో తయారీ రంగానికి అవసరమైన కలప, కోకింగ్ బొగ్గు, స్క్రాప్, వివిధ ముడిసరుకులకు సుంకల మినహాయింపు లభించనుంది. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గి భారత పరిశ్రమలు ప్రపంచ పరిశ్రమలతో పోటీపడనున్నాయి. మరోవైపు, భారత్ లోని సున్నితమైన రంగాలను పరిరక్షించడానికి 29.97% సుంకాల లిమిట్స్ ను మినహాయించారు. ద్వైపాక్షిక వాణిజ్య విలువలో 95% వాటా కలిగిన ఉత్పత్తులకు సుంకాలను మినహాయింపు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Also Read: వాణిజ్య ఒప్పందంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్.. విదేశీ కంపెనీలకే ప్రాధాన్యమా?
కలప, ఉన్ని, గొర్రె మాంసం, తోలు వంటి వస్తువులపై భారత్ గతంలో 30 శాతం సుంకాలు విధించేది. ఈ సుంకాలను ప్రస్తుత ఒప్పందంలో తొలగించనుంది. అదేవిధంగా, పెట్రోలియం, మాల్ట్ ఎక్స్ట్రాక్ట్, వెజిటేబుల్ ఆయిల్స్, విద్యుత్, యాత్ర పరికరాలు, పెప్టోన్లతో సహా 35.60 శాతం టారిఫ్ లైన్లపై 3, 5, 7, 10 సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా సుంకం తొలగించనున్నారు.