Hanumakonda: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండల కేంద్రంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూలి రేట్ల విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారి, వలస కార్మికులు స్థానిక మేస్త్రీలపై దాడికి దిగిన ఘటన కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు వలస కార్మికులు ఒక్కసారిగా గుంపుగా చేరి స్థానిక మేస్త్రీలపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం కాగా, మరొకరు శరీరంపై బలమైన దెబ్బలు తగిలినట్లు స్థానికులు తెలిపారు.
Also read: మేడ్చల్ నడిరోడ్డుపై నోరు తెరిచిన యముడు.. పట్టించుకోని అధికారులు
ప్రధాన రహదారిపై మధ్యాహ్న సమయంలోనే ఈ దాడి జరగడం స్థానికుల్లో భయాందోళన కలిగించింది. దాడి దృశ్యాలను కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, అవి సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయ్యాయి. వీడియోల్లో వలస కార్మికులు కర్రలతో స్థానికులను వెంబడిస్తూ దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒక స్థానికుడు మాట్లాడుతూ.. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా 10 నుంచి 15 మంది కార్మికులు కర్రలతో వచ్చి దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కూడా కొట్టారు” అని తెలిపారు. ఈ ఘటనపై బాధితులు మరియు గ్రామస్థులు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Also read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జర్మనీ అవకాశాలపై ఫోకస్.. విదేశాల్లో యువతకు శిక్షణ!