Ethanol Cooking: ఇరాన్ యుద్ధం.. భారత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వంటగ్యాస్ (LPG) సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశంలో దిగుమతయ్యే 90 శాతం ఎల్ పీజీ హర్మూజ్ జలసంధి గుండా వస్తుండగా.. ప్రస్తుతం ఇరాన్ దానిని నియంత్రిస్తుడంతో సరఫరాలో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో LPGపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించి.. దిగుమతులను పరిమితం చేసే మార్గాలను భారత్ అన్వేషించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ ఇథనాల్ తయారీదారులు.. ఆఫ్రికన్ మోడల్ ను తెరపైకి తీసుకొచ్చారు. దానిని అనుసరించడం ద్వారా దేశంలో వంటగ్యాస్ సమస్యను అధిగమించవచ్చని పేర్కొంటున్నారు.
ఆఫ్రికాలోని టాంజానియా, ఇథియోపియా, కెన్యా వంటి దేశాలు వంట గ్యాస్ (LPG)పై ఆధారపడటాన్ని తగ్గించడానికి ‘ఇథనాల్ వంట సొల్యూషన్స్’ (Ethanol Cooking Solutions) ను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఈ దేశాలు కట్టెలు, బొగ్గు లేదా దిగుమతి చేసుకున్న LPGకి బదులుగా స్థానికంగా లభించే ఇథనాల్ను వంట ఇంధనంగా వాడుతున్నాయి. టాంజానియా దేశం సుమారు 1.10 లక్షల ఇథనాల్ స్టవ్ లను ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) తన శ్వేత పత్రంలో తెలియజేసింది.
ఎల్పీజీ సమస్య నుంచి గట్టెక్కెందుకు ఇథియోపియా దేశం.. ప్రాజెక్ట్ గైయా (Project Gaia)ను సైతం చేపట్టిందని ISMA తెలిపింది. దాదాపు 2 లక్షల ఇళ్లలో ఇథనాల్ స్టవ్లను ఉపయోగించేలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. మరోవైపు కెన్యా సైతం తమ ప్రజలను ఇథనాల్ ఇంధనం వైపునకు మళ్లించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దేశంలో బొగ్గు, కట్టెల వాడకాన్ని తగ్గించి 15 లక్షల కుటుంబాలను ఇథనాల్ ఇంధనం వైపు మళ్లించేలా మార్కెట్ నమూనాను రూపొందించింది. మరోవైపు ఆఫ్రికన్ దేశాలైన మాలి, నైజిరియా సైతం 5 లక్షల ఇథనాల్, సోలార్ స్టవ్ లను ఏర్పాటు చేసే దిశగా అడుగు వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) ప్రకారం.. భారత్ సైతం ఆఫ్రికన్ దేశాల మోడల్ ను అనుసరిస్తే అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ముఖ్యంగా LPG దిగుమతులపై ఆధారపడటం భారీగా తగ్గిపోతుంది. భారత్ తన వార్షిక LPG అవసరాలలో దాదాపు 60% (34 మిలియన్ టన్నులు) విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. ఇథనాల్ వాడకం పెరిగితే ఈ భారం తగ్గుతుంది.
భారత ప్రభుత్వం.. విదేశాల నుంచి పెద్ద మెుత్తంలో LPGని దిగుమతి చేసుకోవడమే కాకుండా దానిని సామాన్యులపై భారం పడకుండా సబ్సిడీలను సైతం అందిస్తోంది. ఇథనాల్ వినియోగం వైపునకు మళ్లితే.. సబ్సిడీల రూపంలో దాదాపు 24 బిలియన్ డాలర్లు (రూ. 2 లక్షల కోట్ల పైగా) నిధులు ఆదా కావచ్చని అంచనా. ఇథనాల్ స్టవ్లు LPG లాగే నీలి రంగు మంటను ఇస్తాయి కాబట్టి పొగ రాదు. కాబట్టి ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది.
Also Read: విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు, సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రులు
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో (గల్ఫ్ దేశాలలో) జరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ‘హార్ముజ్ జలసంధి’ ద్వారా వచ్చే గ్యాస్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. మన దేశానికి వచ్చే LPGలో 90% ఈ మార్గం ద్వారానే వస్తోంది. అందుకే ప్రభుత్వం కూడా ఇథనాల్, బయోగ్యాస్, ఎలక్ట్రిక్ కుకింగ్ను ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని చూస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, వీధి వ్యాపారులు, కమ్యూనిటీ కిచెన్లలో ఇథనాల్ స్టవ్లను ప్రవేశపెట్టడం వల్ల ఎల్ పీజీ వాడకాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: Bengal Tollywood: బెంగాలీ చిత్ర పరిశ్రమ నిరవధిక సమ్మె.. ఆయన మరణం వెనక రియాలిటీ..