April 1st New Rules: మార్చి నెలతో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ 1, 2026 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను నుంచి రైలు టికెట్ల వరకు అనేక మార్పులు అమల్లోకి వస్తాయి. వీటిలో కొన్ని రోజువారీ ఖర్చులు, బడ్జెట్ ప్రణాళికపై ఎఫెక్ట్ చూపించనున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఈ ఏడాది ప్రధాన మార్పు ఏంటంటే, 1961 చట్టం స్థానంలో 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. పన్ను నిబంధనలను సులభతరం చేసేలా కేంద్రం దృష్టి సారించింది. ‘అసెస్మెంట్ ఇయర్’, ‘ప్రీవియస్ ఇయర్’ అనే పదాలను స్థానంలో ఇకపై ‘పన్ను సంవత్సరం’ అనే ఒకే పదాన్ని వాడనున్నారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు, రిటర్న్లను దాఖలు చేసే సమయంలో గందరగోళానికి గురవుతుండడంతో.. ఈ నిబంధనల్లో మార్పులు చేశారు. టీడీఎస్ మినహాయింపులను ట్రాక్ చేయడానికి ఫామ్ 130 అనే కొత్త డాక్యుమెంట్ ను వాడుకలోకి తీసుకురానున్నారు.
ఈ ఫామ్ యజమానులు తమ ఉద్యోగులకు జారీ చేస్తారు. కాగా కొన్ని బ్యాంకులు అర్హులైన సీనియర్ సిటిజన్లకు అందించవచ్చు. టీడీఎస్ మినహాయించి, ప్రభుత్వానికి జమ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తారు. ట్యాక్స్ పేయర్స్ తమ టీడీఎస్ మినహాయింపులను మరింత క్లియర్ గా ట్రాక్ చేసేందుకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.
ఏటీఎం నుంచి మనీ విత్ డ్రాయల్స్, రోజువారీ నిబంధనలను బ్యాంకులు మార్పుచేశాయి. 5 ఉచిత విత్ డ్రాయల్స్ తర్వాత యూపీఐ ద్వారా ఏటీఎం నగదు విత్ డ్రా హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఒక్కో లావాదేవీకి రూ. 23 వసూలు చేయనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు పలు డెబిట్ కార్డులపై డబ్బు విత్డ్రాయల్ పరిమితులను తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ పరిమితి రూ. 50,000 నుంచి రూ. 75,000 లకు మార్చింది.
రైలు టిక్కెట్ల రద్దు నిబంధనలను రైల్వే శాఖ కఠినతరం చేసింది. తరచుగా రైలులో ప్రయాణించే వారు మార్పులు గమనించాల్సి ఉంటుంది. ఇంతకుముందు 4 గంటల వ్యవధికి బదులుగా, ఇప్పుడు రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు టికెట్ను రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. 8 నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే 50% రీఫండ్ వస్తుంది. అయితే 24 నుంచి 72 గంటల మధ్య రద్దు చేస్తే 25% కోత విధిస్తారు. టికెట్లను 72 గంటల కంటే ముందుగా రద్దు చేసుకుంటే ఛార్జీలు మినహాయించి మిగిలిన మొత్తం తిరిగి చెల్లిస్తారు.
Also Read: పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచి వీటికి మాత్రమే తప్పనిసరి
పాన్ దరఖాస్తు రూల్స్ ను కఠినతరం చేశారు. ఇకపై పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పుట్టిన తేదీకి సంబంధించిన స్పష్టమైన రుజువు సబ్మిట్ చేయాలి. ఏప్రిల్ 1 నుండి పుట్టిన తేదీ రుజువుగా ఆధార్ ఒక్కటే సరిపోదు. దరఖాస్తుదారులు 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ వంటి కీలక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఐదు మార్పులు విడిగా అంత పెద్దదిగా అనిపించకపోయినా, అవన్నీ కలిసి రాబోయే సంవత్సరంలో రోజు వారీ ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేయగలవు.