No Cost EMI: ప్రస్తుత రోజుల్లో నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) తెగ పాపులర్ అవుతోంది. సాధారణంగా ఈఎంఐ అంటే వడ్డీతో పాటు కొన్న వస్తువుకు సంబంధించిన అసలు ధరను కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ నో కాస్ట్ ఈఎంఐలో వడ్డీతో పనిలేకుండా కేవలం అసలు మాత్రమే వాయిదాల రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇది చూడటానికి కస్టమర్లకు పెద్ద ఆఫర్ ఇస్తున్నట్లు అనిపించినా.. దీని వెనుక పెద్ద వ్యాపార వ్యూహామే ఉందని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ లేకుండా వస్తువు కొన్నప్పటికీ వినియోగదారులు నష్టపోతున్నట్లు పేర్కొంటున్నారు. అది ఏవిధంగానో ఈ కథనంలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) ప్రకారం బ్యాంకులు 0 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వడానికి అస్సలు వీల్లేదు. కాబట్టి నో కాస్ట్ ఈఎంఐలో కూడా వడ్డీని పూర్తిగా తీసివేయడం జరగదని నిపుణులు చెబుతున్నారు. కానీ అది కస్టమర్కు తెలియకుండా జిమ్మిక్కు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ముందుగానే వస్తువు ధరను పెంచేసి.. చెల్లించాల్సిన వడ్డీని ముందే కస్టమర్ నుంచి వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక రూ.10,000 వస్తువును 3 నెలల ఈఎంఐలో కొంటే.. బ్యాంకు వసూలు చేసే వడ్డీ రూ.1500 అనుకుందాం. నో కాస్ట్ ఈఎంఐలో భాగంగా రూ.1,500 వడ్డీని కస్టమర్ తరపున ఇ-కామర్స్ సంస్థనే చెల్లిస్తుంది. అయితే ఇక్కడే ఈ-కామర్స్ సంస్థలు ధర పెంపు ట్రిక్ ను ఉపయోగిస్తాయని నిపుణులు అంటున్నారు. వస్తువు అసలు ధర రూ.10,000 అయితే దాన్ని రూ.11,500గా పెంచి.. No Cost EMI ఆఫర్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ఈఎంఐ వడ్డీని వస్తువు ధరతో కలిపేసి ఈ-కామర్స్ సంస్థలు వసూలు చేస్తున్నట్లు నిపుణులు అంటున్నారు.
ఈ కామర్స్ సైట్స్ No Cost EMI ఇవ్వడం వల్ల.. ఒకేసారి రూ.50,000 కట్టలేని వారు కూడా వడ్డీలేదన్న ఆశతో ధైర్యంగా ఆ వస్తువును కొంటున్నారు. దీనివల్ల కంపెనీ సేల్స్ పెరిగి గణనీయమైన లాభాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎంతో కాలంగా పేరుకుపోయిన ఉన్న స్టాక్ ను క్లియర్ చేయడానికి కూడా కొన్ని సంస్థలు.. ఈ నో కాస్ట్ ఈఎంఐ ట్రిక్క్ ను ఫాలో అవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు బ్యాంకుల విషయానికి వస్తే అవి కూడా బాగానే లాభపడుతున్నట్లు తెలుస్తోంది. ఈఎంఐ ఆఫర్ల పేరుతో క్రెడిట్ కార్డులు, లోన్లు ఇచ్చే అవకాశం వాటికి లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ప్రక్రియలో వడ్డీని ఈ – కామర్స్ సంస్థలు లేదా వ్యాపారులు చెల్లిస్తే.. ప్రాసెసింగ్ ఫీజును కస్టమర్ల నుంచి బ్యాంకులు వసూలు చేస్తున్నాయి.
సాధారణంగా చాలా మంది నో కాస్ట్ ఈఎంఐ అంటే వస్తువు ధర మినహా ఒక్కపైసా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. కానీ నో కాస్ట్ ఈఎంఐ ముసుగులో కొన్ని హిడెన్ ఛార్జీలను కస్టమర్ల నుంచి బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. దాదాపు ప్రతీ ఈఎంఐ లావాదేవీపై బ్యాంకులు రూ.99-299 వరకూ ప్రాసెసింగ్ ఫీజును ఛార్జ్ చేస్తాయి. వస్తువుపై పడ్డ వడ్డీని ఈ కామర్స్ సంస్థ లేదా రీటైలర్ చెల్లించినప్పటికీ వడ్డీ మెుత్తం మీద 18 శాతం జీఎస్టీని కస్టమరే చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీరు ప్రతీనెల చెల్లించే బిల్లులో అదనంగా కలుపుతారు. ఒకవేళ మీరు మధ్యలోనే లోన్ క్లోజ్ చేయాలనుకుంటే 2% నుంచి 4% వరకు జరిమానా, అలాగే తర్వాతి నెలకు సంబంధించి ఈఎంఐను కూడా మీ నుంచే బ్యాంకులు వసూలు చేస్తాయి.
నో కాస్ట్ ఈఎంఐలో వస్తువు కొంటే.. పూర్తి నగదు చెల్లింపుపై వచ్చే 5-10 క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్ ను కస్టమర్లు కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా చేతిలో డబ్బులు లేకపోయినా.. ఈఎంఐ సౌకర్యం ఉంది కదా అని అవసరం లేని వస్తువులను కొని అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఒక్క నెల ఈఎంఐ చెల్లించకపోయినా, ఆలస్యమైనా భారీ పెనాల్టీ పడటమే కాకుండా.. సిబిల్ స్కోర్ (CIBIL Score) దారుణంగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో హోమ్ లోన్ లేదా కార్ లోన్ తీసుకోవడం కష్టంగా మారొచ్చు. మెుత్తంగా వ్యాపార సంస్థలు వేస్తున్న నో కాస్ట్ ఈఎంఐ గాలానికి చిక్కుకొని కస్టమర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, తద్వారా అధిక ఈఎంఐల భారం మోయలేక మోసపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: జియో vs ఎయిర్టెల్.. రూ.355 ప్లాన్ల మధ్య గట్టి పోటీ.. రెండింట్లో ఏది బెస్ట్ అంటే?