హైడ్రాపై కేసీఆర్ విరుచుకుపడ్డారు మొన్న జగిత్యాల సభలో. ఇంతోటి అందానికి బోడిముండ హైడ్రా ఒకటి తెచ్చిపెట్టిర్రు.. పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చేస్తుర్రు..! అన్నారాయన. చెరువులను మేము బాగు చేయలేదా? మిషన్ కాకతీయ పథకంతో. ఇగ మీరే బాగు చేస్తున్నరా? హైడ్రా లేదు గియ్డ్రా లేదు.. మేము అధికారంలోకి రాంగనే అవతల ఇసిరి పారేస్తం..! అని శపథం పూనారు కేసీఆర్. ఇంక ఇది హైదరాబాద్లోనే కాదు.. గా పీసీసీ చీఫ్ తన సొంత జిల్లా నిజామాబాద్ల కూడ పెట్తడట నిడ్రా అని. ఇగ రేపు రేపు జగిత్యాల కూడా పెడ్తరచ్చు .. జిడ్రా అని… అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారాయన. దీనిపై ఇవాళ పీసీసీ చీఫ్ స్పందించారు.
హైడ్రా వల్ల పేదలకు ఎవరికి నష్టం వాటిల్లడం లేదన్నారాయన. భూకబ్జాదారులకు మాత్రం వణుకుతున్నారని.. ఎవరికైనా పేదలకు నష్టం జరిగితే మాకు చెప్పండి.. మేం వెంటనే దాన్ని పరిష్కరిస్తాం.. అని కూడా అన్నారు. హైదరాబాద్లో ఖరీదైన చెరువుల స్థలాలను బీఆరెస్ నేతలు కబ్జాలు చేసుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్తులను, చెరువులను కాపాడుతున్నామని చెప్పారు మహేశ్. అయితే.. ఆయన హైడ్రాను నిజామాబాద్ జిల్లాలో కూడా అమలు చేస్తామని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అక్కడ ఎమ్మెల్యేలు, బీఆరెస్ నేతలు భూదందా చేశారని, వారి భరతం పడుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిప్పుడు ఇందూరు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
గతంలో కూడా మహేశ్ పలుమార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే , కేసీఆర్ నోటి వెంట ప్రత్యేకించి నిడ్రా పేరుతో దీన్ని నిజామాబాద్లో కూడా అమలు చేస్తామని మహేశ్కుమార్ గౌడ్ చెప్పిండని అనడం.. దీనికి ఇవాళ కౌంటర్గా.. వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా మహేశ్ స్పందించడం చర్చకు తెర తీసింది. దీంతో పాటు ఆయన .. బీఆరెస్ నేతలు, ఎమ్మెల్యేలు భూదందాలో భాగస్వామ్యమయ్యారని ఆరోపించడం కూడా కలకలం రేపింది. పదేళ్ల పాలనలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బీఆరెస్ పార్టీకి కంచుకోటలా ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ వారే. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణం చేపట్టిన తరువాత ఆ చుట్టుపక్కల శివారు ప్రాంతాల భూములను బీఆరెస్ నేతలు బలవంతంగా కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. వందల ఎకరాల భూములు ఇప్పుడు బీఆరెస్ నేతల చెరలోనే ఉన్నాయి.
అమాంతం అక్కడ రేట్లు పెంచేశారు. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చారు. ఆర్మూర్ ఎమ్మెల్యేకు సంబంధించిన ప్లాట్లు కూడా విపరీతంగా ఇక్కడ డెవలప్ చేసి ఉన్నారు. ఇది వివాదస్పద భూముల్లోనే ఉన్నాయి. బలవంతంగా లాక్కున్నారని రైతులు అక్కడ ఆందోళనలు కూడా చేశారు. ఇప్పుడు పీసీసీ హోదాలో మహేశ్.. తన సొంత జిల్లా నిజామాబాద్లో అమలు చేస్తానని ప్రకటించడం.. అక్కడ బీఆరెస్ నేతల భూదందాల భరతం పడతానని హెచ్చరించడం కబ్జాదారులకు కంగారెత్తిస్తున్నది. కేసీఆర్ చేసిన విమర్శకు .. మహేశ్ స్పందన మరింత ఘాటుగా వచ్చిందనే భావన ఏర్పడింది. జిల్లాలకు ఇది విస్తరించబోతున్నట్టుగా ఆయన పరోక్షంగా కేసీఆర్కు కౌంటర్గా ఈ కామెంట్లు చేసినట్టు భావిస్తున్నారు.
ఇక హైడ్రా దూకుడు మరింతగా ఉండే అవకాశాలున్నాయి. దీనిపై వెనకడుగు వేస్తే కేసీఆర్ చెప్పినట్టుగానే పేదల ఇండ్లను కూల్చుతున్నారనే అపవాదును సర్కార్ మూటగట్టుకుంటుంది. అందుకే ఆ వాదనకు చాన్స్ లేకుండా కబ్జాదారుల భరతం పట్టే విధంగా హైడ్రా ఆపరేషన్ మరింత స్పీడుగా ఉండటంతో పాటు అది జిల్లాలకు కూడా విస్తరించే పనిలో పడనుంది సర్కార్. మొన్నటి వరకు హైదరాబాద్కే పరిమితమైన హైడ్రా…ఇక నిడ్రా, జిడ్రాల పేర్లతో జిల్లాల్లో కూడా అమలు చేసి పదేళ్ల పాలనలో కబ్జాలకు గురైన భూముల మీద ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది.