India GCC FTA: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం రెండు కీలక వాణిజ్య ఒప్పందాలపై కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు గల్ఫ్ దేశాలతో (GCC) చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) దిశగా అడుగులు వేయగా, మరోవైపు అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మొదటి విడత దాదాపు సిద్ధమైందని వెల్లడించారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో తన ఆర్థిక సంబంధాలను పెంచుకోవడంలో ప్రధాని మోదీ నాయకత్వంలో సాధిస్తున్న పురోగతికి ఈ పరిణామాలు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మొదటగా, న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో భారత్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) పై సంతకాలు జరిగాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతో కూడిన ఈ కూటమిలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులు, సేవలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు (MSME), నైపుణ్యం కలిగిన యువత, వ్యవస్థాపకులకు గల్ఫ్ దేశాలలో భారీ అవకాశాలు లభిస్తాయి. సుమారు ఐదు వేల ఏళ్ల నాటి వాణిజ్య సంబంధం ఇప్పుడు అధికారికంగా మరింత పటిష్టం కానుందని గోయల్ హర్షం వ్యక్తం చేశారు.
అదే వేదికపై మంత్రి పీయూష్ గోయల్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి సంచలన వివరాలు వెల్లడించారు. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో భారత్, అమెరికా ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నాయని, మార్చి మధ్య నాటికి అధికారిక న్యాయపరమైన ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తున్న సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయనున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్ తన సున్నితమైన రంగాలైన వ్యవసాయం, డెయిరీ (పాలు మరియు పాల ఉత్పత్తులు) ను విదేశీ పోటీ నుంచి రక్షించిందని గోయల్ లోక్సభలో వెల్లడించారు. అదే సమయంలో అమెరికా నుంచి ముడి చమురు, గ్యాస్, కోల్, సాంకేతిక ఉత్పత్తుల కొనుగోళ్లను భారీగా పెంచనున్నట్లు తెలిపారు. అమెరికా నుంచి విమానాలు మరియు ఇంజిన్ల కొనుగోలు ఆర్డర్లే దాదాపు 100 బిలియన్ డాలర్లు దాటుతాయని ఆయన అంచనా వేశారు. 2030 నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ ఒప్పందం రూపొందిందన్నారు.