Gold Market: ప్రపంచంలో కెల్లా బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో బంగారాన్ని అభరణంగా మాత్రమే కాకుండా దానినొక సెంటిమెంట్ గా చూస్తుంటారు. పండుగలు, శుభకార్యాలకు కలిసొచ్చే వస్తువుగా బంగారాన్ని అభివర్ణిస్తుంటారు. అంతేకాకుండా సురక్షితమైన పెట్టుబడి మార్గంగానూ ప్రస్తుతం పసిడి మారిపోయింది. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఏడాదిపాటు బంగారాన్ని కొనడం ఆపేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవేళ అదే జరిగితే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
భారత్ తన బంగారం అవసరాలలో దాదాపు 90% దిగుమతుల ద్వారానే పొందుతోంది. ప్రధాని పిలుపునిచ్చినట్లుగా భారతీయులు ఏడాది పాటు గోల్డ్ కొనకపోతే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం కలుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం (Foreign Exchange) ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. భారత్ ప్రతీ ఏటా బంగారం కోసం సుమారు 60 నుండి 70 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే సుమారు రూ.6.7 లక్షల కోట్ల విదేశీ ధనం ఒక్క బంగారం దిగుమతికే భారత్ వెచ్చిస్తోంది. మోదీ పిలుపుతో గోల్డ్ కొనుగోళ్లు ఆగిపోతే ఆ డబ్బంతా ఆదా కానుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రపంచ బంగారం డిమాండ్లో భారత్ వాటా సుమారు 20 శాతం నుంచి 25 శాతంగా ఉన్నట్లు అంచనా. భారత్ వంటి పెద్ద మార్కెట్ ఒక్కసారిగా కొనుగోళ్లు ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బంగారానికి డిమాండ్ పడిపోవచ్చని పేర్కొంటున్నారు. అదే జరిగితే బంగారం ధరలు ప్రస్తుతం ఉన్న దానికంటే భారీగా తగ్గుతాయని విశ్లేషిస్తున్నారు.
భారత్ తన బంగారం దిగుమతుల కోసం ప్రధానంగా కొన్ని దేశాలపై ఆధారపడుతోంది. భారత్ దిగుమతి చేసుకునే బంగారంలో సగానికి పైగా స్విట్జర్లాండ్ నుంచే వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత్ బంగారం దిగుమతిని తగ్గిస్తే.. అది స్విస్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. మరోవైపు ప్రపంచ గోల్డ్ ట్రేడింగ్ కు హబ్ గా ఉన్న దుబాయికి సైతం.. భారత్ నిర్ణయంతో భారీ ఎదురుదెబ్బ తగిలొచ్చని నిపుణులు అంటున్నారు. అటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి కూడా భారత్ భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది కాబట్టి.. మోదీ పిలుపుతో అక్కడి గోల్డ్ మైనింగ్ రంగం సైతం తీవ్ర సంక్షోభంలో పడే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.
Also Read: Jio యూజర్లకు పండుగే.. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే.. టాప్-5 ప్లాన్లు ఇవే!
గోల్డ్ కొనుగోలు నిలిపివేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరినప్పటికీ.. దేశీయంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాజికంగా, ఉపాధి పరంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. దేశంలో రత్నాలు, ఆభరణాల రంగంపై సుమారు కోటి మందికి పైగా కార్మికులు, కళాకారులు ఆధారపడి జీవిస్తున్నారు. కొనుగోళ్లు లేకపోతే వారితో పాటు వారి కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉంది. మరోవైపు అధికారికంగా గోల్డ్ దిగుమతులు ఆపేసినా.. దొడ్డిదారిన బంగారం దేశంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: జియో యూజర్లకు భారీ షాక్.. రూ. 249 ప్లాన్ క్లోజ్.. ప్రత్యామ్నాయ బెస్ట్ ప్లాన్లు ఇవే!