India Rupee: ఇటీవల వరుసగా రూపాయి భారీ పతనాన్ని చూసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంది. దీంతో ఏడు నెలల్లో తొలిసారిగా రూపాయి బలపడింది. గత సెషన్లో రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి మారకం విలువ బుధవారం 1% వరకు పెరిగి 90.0963కి చేరుకుంది. స్థానిక మార్కెట్ లో డాలర్ జోరుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రేక్ వేసిందని విశ్లేషకులు తెలిపారు. మే 23 తర్వాత తొలిసారిగా రూపాయి తిరిగి పుంజుకుందని చెప్పారు.
గత కొన్ని వారాలుగా రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. దీంతో భారత కరెన్సీకి మద్దతుగా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని సర్వత్రా చర్చ జరిగింది. మంగళవారం విదేశీ మారకం విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఆర్బీఐ జోక్యం చేసుకునే అవకాశం ఉందని వ్యాపారులు భావించారు.
“రూపాయి వేగంగా పతనం అవ్వడంతో..ఆర్బీఐ కల్పించుకుని డాలర్ దూకుడుగా కళ్లెం వేసిందని” అని కరూర్ వైశ్యా బ్యాంక్ ట్రెజరీ హెడ్ వీఆర్సీ రెడ్డి అన్నారు. మంగళవారం రూపాయి ఆల్టైమ్ కనిష్ట స్థాయి 91.0837 తాకిన తర్వాత, బుధవారం డాలర్తో పోలిస్తే రూపాయి 0.7% పెరిగి 90.3775 వద్ద ముగిసింది. రూపాయికి వ్యతిరేకంగా ఊహాగానాలు పెరుగుతుండడంతో.. ఆర్బీఐ చర్యలు చేపట్టింది. కేంద్ర బ్యాంకు సంకేతాలతో రూపాయి దాదాపు 1% లాభపడింది.
అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు కాకపోవడంతో స్థానిక స్టాక్లు, బాండ్లలో విదేశీ పెట్టుబడుల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో రూపాయి మారకం విలువ దాదాపు 2% తగ్గింది. ఈ సంవత్సరం స్థానిక ఈక్విటీల నుంచి విదేశీ ముదుపుదారులు సుమారు 18 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నాయి. ఈ ఉపసంహరణలతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. అయితే 50% యూఎస్ సుంకాలు రూపాయి క్షీణతకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.