Gitam University: సామాన్యులకు వంద రెండొందల కరెంటు బిల్లునే కట్టకుంటే వేధించి లైన్ కట్ చేస్తారు విద్యుత్ సిబ్బంది. గత ఇరవై ఏళ్లుగా కరెంటు బిల్లు కట్టకుండా ఒక ప్రైవేట్ యూనివర్శిటీ నెట్టుకొస్తుంటే.. ఇంత వరకూ ఎలాంటి స్పందనా లేదు. కోర్టు కలగజేసుకునే వరకూ కనీస రియాక్షన్లు కరవు. ఇంతకీ ఎక్కడిదీ షాకింగ్ న్యూస్ అని చూస్తే..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రుద్రారం గ్రామ శివారులో.. గీతం యూనివర్శిటీ ఉంది. ఈ ప్రైవేటు యూనివర్శిటీ సుమారు.. 20 ఏళ్లుగా కరెంటు బిల్లులు కట్టకుండా నెట్టుకొస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు రూ. 118 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదంటూ అధికారులు నోటీసుల్లో తెలిపారు. కానీ.. ఒక భారీ ప్రైవేట్ విద్యాసంస్థ కోట్ల రూపాయల బకాయిలు పెట్టినా విద్యుత్ శాఖ అధికారులు కనీసం నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా చేయలేకపోవడం వెనుక ఉన్న ‘మతలబు’ ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ హైకోర్టు విద్యుత్ శాఖ అధికారుల తీరును తీవ్రంగా ఖండించింది. కోర్టు జోక్యంతో స్పందించిన ఎస్పీడీసీఎల్ (SPDCL) బకాయిలు చెల్లించాలని తాజాగా యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా అధికారులు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మొహం చాటేస్తున్నారు. ఇరవై ఏళ్లుగా రాజకీయ ఒత్తిళ్లా? లేక అధికారుల నిర్లక్ష్యమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగంలోని ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది.
ALSO READ: JAC Protest: శంషాబాద్ బచావో..చార్మినార్ హటావో.. జేఏసీ, విద్యార్థుల భారీ ర్యాలీ