UPI Yes or No Payment: దేశంలో డిజిటల్ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో.. ఆన్లైన్ పేమెంట్ మోసాలు కూడా అదే విధంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ను అడ్డుకోవడానికి దేశంలోని ప్రధాన బ్యాంకులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. దీని కోసం లావాదేవీల సమయాల్లో ‘Yes Or No’ విధానాన్ని పరిచయం చేయాలని ఆర్బీఐకి (RBI) బ్యాంకులు ప్రతిపాదించాయి.
ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. మీరు ఎవరికైనా డబ్బులు పంపుతున్నప్పుడు యాప్ మిమ్మల్ని ఆ పేమెంట్ను ఖరారు చేయమని ఒక సందేశం ద్వారా అడుగుతుంది. స్క్రీన్పై వచ్చిన మెసేజ్ కు మీరు ‘Yes’ అని క్లిక్ చేస్తే.. సదరు నగదు మెుత్తం తక్షణమే ఎదుటివారి ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ ‘No’ అని ఎంచుకుంటే.. ఆ లావాదేవీ వెంటనే రద్దవుతుంది.
ఒకవేళ స్క్రీన్పై వచ్చిన ప్రాంప్ట్కు యూజర్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోయినా.. లావాదేవీ ఏమి రద్దు కాదు. అయితే ఒక గంట ఆలస్యంగా ఎదుటి వ్యక్తి ఖాతాకు నగదు జమ అవుతుందని బ్యాకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ‘Yes or No’ ప్రతిపాదన.. ప్రతీ లావాదేవీకి వర్తించదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సదరు యూజర్ రెగ్యులర్ లావాదేవీలకు భిన్నంగా ఉండే వాటికి మాత్రమే ఈ ప్రాంప్ట్ కనిపిస్తుందని పేర్కొంటున్నాయి.
ఉదాహరణకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా డబ్బు పంపేందుకు యత్నించినప్పుడు ఈ ప్రాంప్ట్ కనిపించనుంది. అలాగే గతంలో లావాదేవీ జరపని కొత్త ఖాతాకు పెద్ద మెుత్తంలో డబ్బు పంపుతున్నప్పుడు కూడా ‘Yes or No’ కన్ఫామ్ చేయాల్సి రావొచ్చు. ఫేక్ కాల్స్, బెదిరింపులు, డిజిటల్ అరెస్టులు వంటి మోసాల నుండి యూజర్లను రక్షించడానికి ఈ ప్రాంప్ట్ సహాయపడుతుందని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దేశంలో డిజిటల్ లావాదేవీలను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మాత్రం ఈ ప్రతిపాదనపై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ‘Yes or No’ ఆప్షన్ ను ఏ ఒక్క యూజర్ ఎంచుకోని సందర్భంలో గంటపాటు లావాదేవీ ఆలస్యం కావడాన్ని తప్పుబడుతోంది. భారతీయులు వేగవంతమైన డిజిటల్ చెల్లింపులకు ఆలవాటు పడ్డారని.. ఇతర దేశాల నెమ్మదైన విధానాలను మనం కాపీ చేయకూడదని NPCI భావిస్తోంది. పెట్టుబడుల పేరిట జరిగే స్కామ్లు, మ్యూల్ అకౌంట్ల వినియోగాన్ని ఈ గంట ఆలస్యం అడ్డుకోలేదని అభిప్రాయపడింది.
Also Read: ఇంట్లో పెట్స్ ఒంటరిగా ఉన్నాయా? రూ.3 వేలలో బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఇవే!
ప్రస్తుతం ‘Yes or No’ ప్రాంప్ట్ అంశం ఆర్ బీఐ పరిధిలో ఉంది. బ్యాంకుల ప్రతిపాదనలు, NPCI అభ్యంతరాలను అది పరిశీలిస్తోంది. మోసాలను తగ్గించడంతో పాటు యూజర్లకు అసౌకర్యం కలగకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆర్బీఐ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read: గ్యాస్ సబ్సిడీ కోసం వెళ్తే.. ఖాతాలో రూ. 100 కోట్లు.. నివ్వెరపోయిన పేద మహిళ!