RBI: లోన్స్ వసూలు విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు నానాటికీ వివాదాస్పదమవుతుందా? రికవరీ ఏజెన్సీల నుంచి తీరుపై ఇంటా బయటా విమర్శలు చెలరేగుతున్నాయా? అసభ్యకర భాష ఉపయోగించడం వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ రంగంలోకి దిగిందా? వీటికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈఎంఐ చెల్లింపులు చేయని వ్యక్తులను రికవరీ ఏజెంట్లు వేధించకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్బిఐ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. తాము ఇచ్చిన వ్యక్తిగత, వాహన లేదా గృహ రుణాల చెల్లింపుల్లో విఫలమైన కస్టమర్ల నుంచి రుణ వసూళ్ల కోసం ఫోన్లు, ల్యాప్టాప్లు పని చేయకుండా చేయడం సమర్ధనీయం కాదని స్పష్టంచేసింది. అయితే ఫోన్లు, ల్యాప్టాప్స్ తాము అందించిన రుణాలతో కొంటే వాటిని డిజేబుల్ చేయవచ్చని తెలిపింది. దానికి కూడా పలు రకాల ఆంక్షలు విధించింది. 2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానుంది.
రుణ బకాయిల వసూళ్ల కోసం అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక.. చివరకు బ్యాంకులు ఫోన్లు, ల్యాప్టాప్లు పని చేయకుండా చేయడం గురించి ఆలోచించాలని సూచన చేసింది. అప్పటికీ ఖాతాదారులకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ల వంటి ఫీచర్లను అడ్డుకోకూడదని క్లారిటీ ఇచ్చింది. రుణాలు వసూళ్ల సమయంలో కొందరు రుణ గ్రహీతలు వేధింపులకు గురవుతున్నారనే ఫిర్యాదులు తలెత్తాయి.
అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి తేవడం, అసభ్యకర భాష ఉపయోగించడం వంటివి తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. రుణాలు వసూలు ప్రక్రియలో బ్యాంకులు-రికవరీ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొంది. ఆర్బీఐ తాజా చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రుణ బకాయిలను వసూలు చేసేందుకు టెక్నాలజీ ఆధారిత విధానాలను ఉపయోగించి రుణగ్రహీతల మొబైల్, ల్యాప్టాప్లను నిలిపివేయడం సాధారణంగా నిషేధం.
బ్యాంకులు ఇచ్చిన రుణాలతో వాటిని కొనుగోలు చేస్తే డిజిటల్ పరికరాలు చేస్తే వాటికి ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అలాంటి సందర్భాల్లో పరికరాన్ని బ్లాక్ చేయకుండా దశలవారీ విధానాన్ని అనుసరించాలని సూచించింది ఆర్బీఐ. అన్ని సేవలను నిలిపివేయడం కాకుండా అవసరాన్ని బట్టి క్రమంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అదే సమయంలో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేసింది.
ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, అత్యవసర SOS వంటి కీలక సౌకర్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపి వేయరాదని ఆదేశించింది. ప్రజల భద్రతకు సంబంధించిన ఈ సేవలు నిత్యం అందుబాటులో ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టేసింది. దీనికి సంబంధించి మే నెలలో రుణాల రికవరీ-రికవరీ ఏజెన్సీల వ్యవహారశైలిపై మార్గదర్శకాలను విడుదల చేసిన ఆర్బీఐ, ప్రజల అభిప్రాయాలను కోరింది.
ALSO READ: మెటాకు భారీ షాక్.. ఏకంగా రూ.4,700 కోట్ల ఫైన్.. ఇంతకీ కేసు ఏంటంటే?
వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత తుది నిబంధనలను రెడీ చేసింది. టెక్నాలజీ ఆధారిత రికవరీ విధానాల్లో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ ఆధారిత రికవరీ వ్యవస్థలను అమలు చేసే బ్యాంకులు, వాటి తరఫున పనిచేసే థర్డ్పార్టీ సేవా సంస్థలు ఆయా పరికరాల తయారీ సంస్థల నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణ పొందాలని ఆదేశించింది ఆర్బీఐ.