RBI New Rules: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. మరణించిన బ్యాంక్ కస్టమర్ల డిపాజిట్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్లను త్వరగా, సులభంగా పరిష్కరించేందుకు గడువును ఇవ్వనుంది. “Reserve Bank of India (Settlement of Claims in respect of Deceased Customers of Banks) Directions, 2025” పేరుతో డ్రాఫ్ట్ సర్క్యులర్ను విడుదల చేస్తూ, ఆగస్టు 27 వరకు ప్రజాభిప్రాయం కోరుతోంది. ఇప్పటివరకు కస్టమర్ మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు లేదా వారసులు డిపాజిట్లు, లాకర్లలోని వస్తువులను క్లెయిమ్ చేసుకోవడంలో పలు బ్యాంకుల విధానాలు భిన్నంగా ఉండటం, అవసరమైన పత్రాల గురించి స్పష్టత లేకపోవడం, ప్రాసెస్ ఎక్కువ సమయం పట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను తగ్గించడమే ఈ కొత్త మార్గదర్శకాల ఉద్దేశ్యం.
ఈ ప్రతిపాదన ప్రకారం, ఇకపై దేశంలోని అన్ని బ్యాంకులు ఒకే తరహా స్టాండర్డైజ్డ్ ఫారమ్లను ఉపయోగించాలి. ఈ ఫారమ్లు ప్రతి బ్యాంక్ బ్రాంచ్లో, అలాగే బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండాలి. వాటితో పాటు, అవసరమైన పత్రాల జాబితా, క్లెయిమ్ దశలవారీ ప్రక్రియ స్పష్టంగా ఇవ్వబడుతుంది. కస్టమర్ ఖాతా లేదా లాకర్లో నామినీ ఉంటే, ఆ నామినీ మరణ సర్టిఫికెట్, తన స్వీయ గుర్తింపు పత్రాలు, చిరునామా రుజువుతో పాటు క్లెయిమ్ ఫారమ్ సమర్పించడమే సరిపోతుంది. అయితే, నామినీ లేని సందర్భంలో లీగల్ హెయిర్లకు ఇబ్బంది లేకుండా సరళమైన విధానాన్ని అనుసరించాలనే నిబంధన ఈ డ్రాఫ్ట్లో ఉంది.
బ్యాంకులు కనీసం రూ.15 లక్షల వరకు కనీ సరిమితి (limit)ని ఫిక్స్ చేయాలి నిర్ణయించాలి. ఈ పరిమితి వరకు క్లెయిమ్ చేసుకునే వారు ఇండెమ్నిటీ బాండ్, ఇతర వారసుల నుండి నో-ఆబ్జెక్షన్ లెటర్ సమర్పించాలి. రూ.15 లక్షల కంటే ఎక్కువ మొత్తాలకు అయితే సక్సెషన్ సర్టిఫికేట్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వంటి అదనపు చట్టపరమైన పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. క్లెయిమ్ ప్రాసెస్ పూర్తి చేయడానికీ RBI ఖచ్చితమైన టైమ్లైన్ను నిర్ణయించింది. అవసరమైన అన్ని పత్రాలు అందుకున్న 15 రోజుల్లోగా బ్యాంకులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లాకర్లు లేదా సేఫ్ కస్టడీలో ఉన్న వస్తువుల విషయంలో, 15 రోజుల్లోపే వివరణ లిస్ట్ తేదీని నిర్ణయించి, దానిని వారసులకు తెలియజేయాలి.
బ్యాంక్ తప్పిదం వల్ల డిపాజిట్ క్లెయిమ్ ప్రాసెస్ నిర్ణీత గడువుకు మించి ఆలస్యం అయితే, ప్రస్తుత బ్యాంక్ రేట్కు 4 శాతం వార్షిక వడ్డీని కలిపి, ఆలస్య కాలానికి అనుగుణంగా పరిహారం చెల్లించాలి. లాకర్లు లేదా సేఫ్ కస్టడీ వస్తువుల విషయంలో ఆలస్యం జరిగితే, రోజుకు ₹5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. RBI ఈ మార్పులతో, మరణించిన కస్టమర్ల కుటుంబ సభ్యులు తమ హక్కు కలిగిన డిపాజిట్లు, లాకర్ వస్తువులను వేగంగా, ఇబ్బంది లేకుండా పొందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకు విధానాల వల్ల కలిగే ఆలస్యం, స్పష్టత లేని ప్రక్రియలు ఇకపై తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.