UPI Cooling Period: యూపీఐ పేమెంట్స్ అంటే ఇన్ స్టెంట్ మనీ ట్రాన్స్ ఫర్. మనీ పంపిన క్షణాల్లో డబ్బులు అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతాయి. అయితే దీన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి డిజిటల్ మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొస్తుంది. UPI లేదా IMPS ద్వారా ఎవరికైనా రూ. 10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పంపితే అవతలి వ్యక్తికి చేరడానికి గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనపై 2026 మే 8 వరకు ఆర్బీఐ సూచనలను ఆహ్వానించింది. ఆ తర్వాత మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది.
2026 నాటికి దేశంలో ఆన్లైన్ మోసాలు రూ. 22,000 కోట్లకు పైగా ఉన్నాయని అంచనా. సైబర్ నేరాలకు అడ్డుకట్టవేసేందుకు ఆర్బీఐ కూలింగ్-ఆఫ్ పీరియడ్ను పరిశీలిస్తోంది. దీని ప్రకారం, లావాదేవీలను ఒక గంట పాటు నిలిపివేస్తుంది. మనీ ట్రాన్స్ ఫర్ చేసినా.. అవతలి వ్యక్తికి గంట పాటు ఆ డబ్బు జమ అవ్వదు. ఈ టైమ్ లో మనీ పంపిన వ్యక్తి.. రిసీవర్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఏదైనా మోసం జరిగినట్లు అనుమానం వస్తే మనీ ట్రాన్స్ ఫర్ ను రద్దు చేయవచ్చు. దేశంలో రూ. 10,000 పైబడిన లావాదేవీలు 45 శాతం అంటే మొత్తం విలువలో 98.5 శాతంగా ఉన్నాయి.
సైబర్ నేరాలు చాలా వరకు బాధితులపై ఒత్తిడి తెచ్చి, వాళ్లు స్పందించడానికి సమయం లేకుండా చేసి డబ్బు కాజేస్తున్నారు. అందుకే ఒక గంట కూలింగ్ పీరియడ్ ఇస్తే బాధితులు ఆలోచించుకునే టైమ్ ఉంటుంది. అయితే ఈ కూలింగ్ పీరియడ్ అందరికీ వర్తించదు. తమకు తెలిసిన వ్యక్తులకు వెంటనే డబ్బులు పంపేందుకు కస్టమర్లను వైట్లిస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల వారికి డబ్బు పంపడానికి ఎలాంటి ఆలస్యం జరగదు. అలాగే ఈ రూల్ దుకాణాలలో చెల్లింపులు, ఇ-మాండేట్లు, చెక్కులు, NACH లావాదేవీలకు వర్తించదు.
Also Read: వావ్, రూ.వెయ్యి లోపు ‘ఫీచర్ ఫోన్లు’ చూశారా? UPI పేమెంట్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!