దేశంలో బంగారం మీద లోన్ తీసుకునే వారికి శుభవార్త. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గోల్డ్ లోన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై బంగారం విలువపై ఎక్కువ శాతం వరకు లోన్ పొందే అవకాశం కలిగింది. ఈ నిర్ణయం ముఖ్యంగా చిన్న మొత్తంలో డబ్బు అవసరమైన వారికి చాలా ఉపయోగపడుతుంది.
ఇదే ఆ లాభం
ఇప్పటివరకు గోల్డ్ లోన్ తీసుకుంటే సాధారణంగా బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే లోన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఈ పరిమితిని పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షల లోపు లోన్ తీసుకునే వారికి బంగారం విలువలో 85 శాతం వరకు లోన్ ఇవ్వవచ్చు. అలాగే రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్యలో లోన్ తీసుకుంటే 80 శాతం వరకు, రూ.5 లక్షలకు పైగా లోన్ తీసుకుంటే 75 శాతం వరకు లోన్ కొనసాగుతుంది.
ఎల్టీవీ అంటే ఏమిటి?
ఈ గోల్డ్ లోన్ విధానంలో ఎల్టీవీ (Loan to Value) అనే అంశం చాలా ముఖ్యమైనది. అంటే మీరు పెట్టే బంగారం విలువతో పోలిస్తే ఎంత శాతం లోన్ ఇస్తారు అన్నదే ఇది. ఉదాహరణకు మీ వద్ద ఉన్న బంగారం విలువ ఒక లక్ష రూపాయలు అయితే 85 శాతం ఎల్టీవీ ప్రకారం రూ.85,000 వరకు లోన్ పొందవచ్చు. ఇదే పాత రూల్స్ ప్రకారం అయితే రూ.75,000 మాత్రమే వచ్చేది. అంటే కొత్త రూల్స్ వల్ల ప్రజలకు అదనంగా డబ్బు పొందే అవకాశం లభిస్తుంది. ఈ కొత్త గోల్డ్ లోన్ నియమాలు అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు), కోఆపరేటివ్ బ్యాంకులు ఇలా అన్నీ ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఒకే విధమైన ప్రయోజనం లభిస్తుంది.
Also read: Hair Growth tips: వేసవిలో జుట్టు రాలిపోకుండా సులువైన హెయిర్ గ్రోత్ చిట్కాలు
ఆర్బీఐ ఈ మార్పులు ఎందుకు తీసుకువచ్చిందంటే ప్రజలకు సులభంగా, త్వరగా లోన్ అందించడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు, అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైన కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు కొంతమంది ఎక్కువ డబ్బు కోసం అధిక వడ్డీకి ప్రైవేట్ వడ్డీదారుల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడు బ్యాంకుల నుంచే ఎక్కువ లోన్ లభించడం వల్ల ఆ అవసరం తగ్గే అవకాశం ఉంది.
తెలుసుకోవాల్సిన అంశాలు
కొత్త రూల్స్లో మరికొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. చిన్న మొత్తంలో లోన్లకు పేపర్వర్క్ను సులభతరం చేయాలని ఆర్బీఐ సూచించింది. అలాగే లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత గరిష్టంగా 7 రోజుల్లో బంగారం తిరిగి ఇవ్వాలి. ఆలస్యం అయితే బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ లోన్ వస్తోంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరలు తగ్గితే లేదా లోన్ తిరిగి చెల్లించలేకపోతే సమస్యలు రావచ్చు. ముఖ్యంగా లోన్ చెల్లించలేకపోతే బ్యాంకులు బంగారం వేలం వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరానికి తగ్గట్టే లోన్ తీసుకోవడం మంచిది.
ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త గోల్డ్ లోన్ రూల్స్ సాధారణ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంది. అదే బంగారంపై ఎక్కువ డబ్బు లభించడం, లోన్ ప్రక్రియ సులభం కావడం వంటి అంశాలు ప్రజలకు సహాయపడతాయి. అయితే బాధ్యతగా లోన్ తీసుకుని, సమయానికి చెల్లిస్తేనే మంచిది.