Salaries Hike: ఏడాది మొత్తం ఎంతో కష్టపడి, తమ ప్రతిభ చూపించి.. బాస్ లను మెప్పిస్తుంటారు ఉద్యోగులు. మార్చి నెల రాగానే సగటు ఉద్యోగి మెదడులో ఒకటే ఆలోచన… ఈ ఏడాదైనా తన సాలరీ పెరుగుతుందా?. వేతన జీవులకు తాజా సర్వే శుభవార్త చెప్పింది. 2026లో వేతనాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉందని ఏఓఎన్ సర్వే స్పష్టం చేసింది. గత ఏడాదిలో నమోదైన 8.9% వేతన పెంపు కంటే ఈ ఏడాది జీతాలు కాస్త ఎక్కువగా జీతాలు పెరగనున్నాయి. వార్షిక వేతన పెంపు అంశంపై అంతర్జాతీయ సంస్థ ఏఓఎన్ ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో భారత్ లోని 45 రంగాలకు చెందిన 1,400కి పైగా సంస్థలు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.
జీతాల పెంపు అంచనాలు ఒక్కో రంగానికి ఒక్కో విధంగా ఉంటాయని ఏఓఎన్ అంచనా వేసింది. అత్యధికంగా రియల్ ఎస్టేట్, మౌలిక రంగాల్లోని ఉద్యోగులకు సుమారు 10.2% జీతాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్బీఎఫ్సీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు 10.1 శాతం పెరగవచ్చు. ఆటోమోటివ్, వాహన తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ రంగాల్లోని సిబ్బందికి దాదాపు 9.9 శాతం వేతనాలు పెరగవచ్చు. ఇంజినీరింగ్, తయారీ, రిటెయిల్ రంగంలో పనిచేసే వారికి 9.5 శాతం ఇంక్రిమెంట్ ఉంటుంది. ఐటీ, ఇంజినీరింగ్, కస్టమర్ బేస్డ్ విభాగాలను బలోపేతం చేయడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని సర్వే తెలిపింది.
భారత్ లో ఉద్యోగులకు ఈ ఏడాది జీతాలు తగిన స్థాయిలో పెరుగుతాయని అంచనా వేసింది. గిరాకీ పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, యూఎస్, ఈయూ సహా పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో జీతాల పెంపునకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని సర్వేలో స్పష్టం అయింది. అలాగే ఉపాధి కోసం వలసలు తగ్గుతున్నాయని పేర్కొంది. గత మూడేళ్లుగా ఈ రేటు తగ్గుతూ వస్తుంది. 2023లో వలసల రేటు 18.7 శాతం కాగా, 2024లో 17.7 శాతం, 2025లో 16.2 శాతానికి దిగ్గిందని పేర్కొంది.
Also Read: ఉద్యోగం కోసం వెళ్లి విగతజీవిగా.. అమెరికాలో తెలంగాణ టెక్కీ కన్నుమూత
ఏఐ భయాలు నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను కొనసాగించే పరిస్థితులు ఉన్నాయని సర్వే నివేదిక తేల్చింది. దేశంలో కొత్త కార్మిక చట్టాల అమల్లోకి రావడంతో కంపెనీలు ఉద్యోగుల జీతాలపై పెంపు సానుకూల నిర్ణయం తీసుకుంటాయని సర్వే రిపోర్టు స్పష్టం చేస్తుంది.