Rajesh Exports Scam: దేశంలో మరొక మెహతా స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఒకటి రెండు కాదు ఏకంగా 15 లక్షలు కోట్ల వ్యవహారం ఇది. ఈ స్కామ్ని గుర్తించిన సెబీ, ఆ కంపెనీ లావాదేవీలపై నిషేధం విధించింది. నాలుగేళ్ల కిందట ఇదే కంపెనీతో ఒప్పందం చేసుకున్నా మాజీ మంత్రి కేటీఆర్. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజల అటెంక్షన్ ఇటు వైపు మళ్లింది.
దేశంలో మరో మెహతా స్కామ్.. ఏకంగా 15 లక్షల కోట్లు
దేశంలో ఇప్పుడు రాజేష్ ఎక్స్ పోర్ట్స్ స్కామ్ గురించి చర్చ జరుగుతోంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ, ప్రపంచ వ్యాప్తంగా బంగారు దిగ్గజంగా పేరు తెచ్చుకుంది. బంగారం వంటి విలువైన లోహాలను శుద్ధి చేయడం, ఆభరణాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడంతో పేరు తెచ్చుకుంది.గడిచిన ఐదేళ్లలో ఆ కంపెనీ ఆదాయాలను రూ.15 లక్షల కోట్లకు పైగా ఎక్కువ చేసి చూపిందన్నది ప్రధాన కారణం.
ఈ విషయాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-సెబీ.. జూన్ 3న రాజేష్ ఎక్స్పోర్ట్స్, చైర్మన్ రాజేష్ మెహతాలను సెక్యూరిటీల మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఐదేళ్లపాటు భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంది.
ఆ కంపెనీపై సెబీ నిషేధం.. పెట్టుబడిదారుల్లో కొత్త ఆందోళనలు
ఆదాయాలలో ఏకంగా రూ. 15.15 లక్షల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని సెబీ పేర్కొంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఈ ఆరోపణలు దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు సృష్టించాయి. ఫలితంగా కార్పొరేట్ వెల్లడింపులు, ఆడిటర్ పర్యవేక్షణ, పెట్టుబడిదారుల రక్షణపై కొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
2024 మార్చి 11న సెబీకి ఆ కంపెనీలోని ఓ వాటాదారు ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదు కారణంగా సెబీ సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. 2024 అక్టోబర్లో దర్యాప్తు సంస్థను నియమించింది సెబీ. ఆ తర్వాత కంపెనీ ఆడిటింగ్, అకౌంట్ల లావాదేవీలను ధృవీకరించడానికి ఫోరెన్సిక్ ఆడిటర్ బీడీఓను రంగంలోకి దించింది.
ఆడిటర్లు అనుబంధ సంస్థలకు సంబంధించిన రికార్డులను పరిశీలించినప్పుడు భారీ వ్యత్యాసాన్ని కనుగొన్నారు. ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడికావడంతో ఆ కంపెనీపై వేటు వేసింది సెబీ. 2021-25 ఆర్థిక సంవత్సరాల మధ్య రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఆదాయం మొత్తం విదేశీ అనుబంధ సంస్థల నుంచి వచ్చింది.
ALSO READ: గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!
మొత్తం అమ్మకాలలో వీటి వాటా 97 శాతం నుండి 99 శాతం వరకు ఉంది. దాదాపు రూ. 15.15 లక్షల కోట్లు వచ్చిందని తెలిపింది. కంపెనీ-అనుబంధ సంస్థల ఆదాయాల కంటే ఎక్కువగా ఉన్నాయని చూపించింది. ఫలితంగా ఐదేళ్లలో రూ. 15.15 లక్షల కోట్ల వ్యత్యాసం ఏర్పడింది.
ఒకవేళ అంతిమంగా ఈ స్కామ్ రుజువైతే భారత దేశ కార్పొరేట్ రంగంలో ఆదాయ దుర్వినియోగం వ్యవహారంలో అతి పెద్దదిగా నిలవనుంది. రాజేశ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ సరైన సాక్ష్యాలు సమర్పించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సెక్యూరిటీస్ల నిర్వహణ చేయకుండా కంపెనీ ప్రమోటరు, ఛైర్మన్, సీఈఓ రాజేశ్ మెహతాపై నిషేధం విధించినట్టు పేర్కొంది.