Stock Market Crash: అంతర్జాతీయ పరిణామాలు, ఆసియా మార్కెట్ల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్పై పడింది. సోమవారం ప్రీ ట్రేడింగ్లో నష్టాల బాట మొదలైంది. ఆ తర్వాత భారీ నష్టాలతో మార్కెట్ ప్రారంభమైంది. అమెరికా-ఇరాన్ మధ్య అనిశ్చితులు, పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం స్టాక్ మార్కెట్ను తాకింది. ఒకానొక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత మెల్లగా కొలుకునే ప్రయత్నం జరుగుతోంది.
దలాల్ స్ట్రీట్లో బేర్ వీరవిహారం
బలహీనమైన ప్రపంచ మార్కెట్ల సంకేతాల మధ్య సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలైంది. అన్ని విభాగాలు అమ్మకాల ఒత్తిడిని చవి చూశాయి. దీని ఫలితంగా సెన్సెక్స్-నిఫ్టీ 50 వంటి ప్రధాన సూచీలు ఒక్కొక్కటి 1 శాతం కంటే ఎక్కువగా కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఒకానొక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పైగానే పతనమయ్యాయి. ఆ తర్వాత మార్కెట్ కోలుకునే పరిస్థితి మొదలైంది.
మధ్యాహ్నం 12 గంటలకు బీఎస్ఈ 398 పాయింట్లు, నిఫ్టీ 136 పాయింట్లు పతనమయ్యాయి. మదుపరులు అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 461 లక్షల కోట్ల నుండి రూ. 452 లక్షల కోట్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా పెట్టుబడిదారులు ఒక్క సెషన్లో దాదాపు రూ. 9 లక్షల కోట్లు నష్టపోయారు.
ఒకానొక దశలో 1000 పాయింట్లు పతనం, రూపాయిదీ అదే పరిస్థితి
ఆ తర్వాత తేరుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇక నిఫ్టీలోని బ్యాకింగ్-1.2 శాతం, ఫార్మా 0. 26 శాతం, ఆటో 1.75, ఎఫ్ఎంసీజీ- 0.91, నిఫ్టీ నెక్ట్స్ 50- 1.90 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసు 1 శాతం పైగానే నష్టపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో చాలా వరకు బలహీనపడింది. ప్రస్తుతం మారకం విలువ 96.31 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి దాదాపు 7 శాతం క్షీణించింది.
ముడి చమురు ధరల భారం, వాణిజ్యలోటు, మదుపర్ల అమ్మకాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు రూపాయిపై ప్రభావం చూపినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రాచ్యంలో రాజుకుంటున్న ఉద్రిక్తతలకు ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగింది.
ALSO READ: బ్యాంకు వినియోగదారులకు అలర్ట్! మే 18-24 మధ్య సెలవులు, ముందుగా ప్లాన్ చేసుకోండి?
అది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బ తీసింది. ఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇరుపక్షాలు తమ వివాదాన్ని ఇంకా పరిష్కరించుకోకపోవడంతో కాల్పుల విరమణ ఒప్పందం అనిశ్చితిలో పడింది. త్వరగా నిర్ణయం తీసుకోకుంటే రాబోయే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించారు.