Oushadhi Express: భారతీయ రైల్వే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (JNPT) కు ఔషధాలను సరఫరా చేసేందుకు ‘ఔషధి ఎక్స్ప్రెస్’ను ప్రారంభించింది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CONCOR) ఆధ్వర్యంలో సనత్ నగర్ ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపో (ICD) నుండి ఈ సేవలు మే 2వ తేదీన ప్రారంభమయ్యాయి. ఔషధాల రవాణా సమయంలో నిరంతర రిఫ్రిజిరేషన్ ఉండేలా డీజిల్ పవర్ ప్యాక్లతో కూడిన అధునాతన రీఫర్ కంటైనర్లను ఈ రైలులో వినియోగిస్తున్నారు.
దేశంలోనే తొలి ప్రత్యేక ఫార్మసీ రైలుగా గుర్తింపు పొందిన ఈ సేవలను తెలంగాణకు కేటాయించడం పట్ల కేంద్ర బొగ్గు.. గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా అందుబాటులోకి వచ్చిన ఈ రైలు.. హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు అంతర్జాతీయ స్థాయి పంపిణీ సౌకర్యాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ.. జీడిమెట్ల.. పటాన్చెరు.. ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాల్లో తయారయ్యే ఔషధాలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ముంబై పోర్టుకు చేరవేయడం అత్యంత అవసరమని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ (రీఫర్ రైలు) వసతి గల ఔషధి ఎక్స్ప్రెస్.. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ నాణ్యత దెబ్బతినకుండా సరైన సమయంలో లక్ష్యానికి చేరుస్తుందని కిషన్ రెడ్డి వివరించారు.
తక్కువ ఖర్చుతో.. పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ సంకల్పం ఇందులో ప్రతిబింబిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వారానికి ఒకసారి నడుస్తున్న ఈ సేవలను.. వాణిజ్య వర్గాల డిమాండ్ మేరకు వారానికి రెండుసార్లు పెంచే దిశగా రైల్వే శాఖ కసరత్తు చేస్తోందని వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు ప్రారంభోత్సవానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
కోల్డ్-చైన్ కనెక్టివిటీని బలోపేతం చేయడంలో ఔషధి ఎక్స్ప్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని.. తక్కువ సమయంలో నాణ్యత తగ్గకుండా మందులను సరఫరా చేయడం వల్ల దేశీయ ఫార్మా రంగం ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుంటుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం మందులే కాకుండా అత్యవసరమైన ఇతర శీతలీకరణ సరుకులను కూడా దీని ద్వారా తరలించవచ్చు. ఇన్నోవేషన్ బేస్డ్ సొల్యూషన్స్తో దేశ ప్రగతికి మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
Read Also: తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదు.. బండి భగీరథ్ కేసుపై.. సీఎం రేవంత్ సంచలనం