Tamil nadu Bus Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శివగంగై సమీపంలోని సమత్తోపురంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు బస్సుల డ్రైవర్ల పరిస్థితి గురించి కూడా ఆందోళన నెలకొంది. ఒక బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు అధికారికంగా ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతోంది.