Head Lice Infestation: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల చిన్నారి లక్ష్మీప్రియ సాహూ, సరైన అవగాహన లేక.. చిన్న సమస్యను అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. చిరుప్రాయంలోనే ఆ బాలిక నూరేళ్ల జీవితం ముగిసిపోవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కేవలం తలలో పేల సమస్యతో మొదలైన ఈ బాధ, చివరకు ఆమె మరణానికి దారితీయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
అయితే లక్ష్మీప్రియ తలలో పేల సమస్య తీవ్రంగా ఉండటంతో, వాటిని వదిలించుకోవడానికి ఆమె తల్లి రకరకాల నూనెలు, ఇంటి చిట్కాలను ప్రయత్నించింది. అయితే, సరైన వైద్యం అందకపోవడంతో ఆ సమస్య మరింత జటిలమైంది. తలలో గాయాలు ఏర్పడి, అవి కాస్తా తీవ్రమైన ఇన్ఫెక్షన్గా (Septicemia) మారాయి. గాయాల నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవడంతో, ఆ చిన్నారి స్కూలుకు వెళ్లలేక తన స్నేహితులకు కూడా దూరమై ఇంట్లోనే ఉండిపోయింది.
పరిస్థితి విషమించడంతో లక్ష్మీప్రియకు రక్తపు వాంతులు మొదలయ్యాయి. ఇది చూసి భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పూరీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శరీరమంతా ఇన్ఫెక్షన్ పాకడంతో, వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే ఆ చిన్నారి కన్నుమూసింది. ప్రాథమికంగా తలలోని గాయాల వల్ల కలిగిన ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరడమే ఈ మరణానికి ప్రధాన కారణమని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: అమ్మ ఒడి అనుకుంటే.. అంగన్వాడీలో యమపాశం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ అమానుషం!
ఈ ఘటన సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. చిన్న ఆరోగ్య సమస్యలే కదా అని సొంత వైద్యం చేసుకోవడం లేదా అశ్రద్ధ చేయడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఉదంతం నిరూపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపాటి చికిత్సతో నయం కావాల్సిన పేల సమస్య, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం మర్చిపోలేని విషాదం.