16- Year Old Boy Dies: ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం.. వీడియోలు తీసే క్రమంలో ఓ 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఉన్న, ఎన్నాళ్లుగానో మూసివేసిన షాపింగ్ మాల్లో రీల్స్ చేస్తూ కింద పడిపోవడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మృతి చెందిన బాలుడిని కావిన్ కుమార్గా గుర్తించారు. అతడు అశోక్ విహార్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి మోడల్ టౌన్లో ఉన్న నార్త్ గేట్ మాల్కు వెళ్లిన కావిన్, అక్కడ వీడియోలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మాల్ 2012 నుంచే పూర్తిగా మూసివేసి ఉంది.
పోలీసుల వివరాల ప్రకారం.. కావిన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి మాల్పై అంతస్తుకు మెట్ల ద్వారా వెళ్లాడు. అక్కడ షాపుల మధ్య భాగంలో ఉన్న ఫైబర్గ్లాస్ షెడ్పై కావిన్ ఎక్కిన సమయంలో అది ఒక్కసారిగా విరిగిపోయింది. దాంతో అతడు దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న కావిన్ను సమీపంలోని పెంటామెడ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై ఆదివారం సాయంత్రం 5:51 గంటలకు.. మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న కావిన్ స్నేహితులను పోలీసులు విచారించారు. వారు ప్రమాదానికి ముందు తీసిన వీడియోలను కూడా పోలీసులకు చూపినట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో సోషల్ మీడియా రీల్స్ కోసం వీడియోలు రికార్డ్ చేస్తున్న సమయంలోనే.. ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
అయితే కావిన్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావిన్ మామ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. సాయంత్రం 5:30 సమయంలో బిల్లియర్డ్స్ ఆడేందుకు వెళ్తున్నానని కావిన్ తల్లికి చెప్పాడు. కానీ అరగంట తర్వాత ఆసుపత్రి నుంచి సమాచారం వచ్చింది. అక్కడ ఉన్న స్నేహితులు ముందుగా కుటుంబానికి సమాచారం ఇవ్వకపోవడం అనుమానాస్పదంగా ఉంది అని అన్నారు.
మరో వ్యక్తి మునిత్ కుమార్ మాట్లాడుతూ, ఇది స్నేహితుల మధ్య జరిగిన డేర్ ఛాలెంజ్ కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా సవాల్ విసిరి ఉండవచ్చు. అందుకే షెడ్పై నడిచే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని ఆయన తెలిపారు. అలాగే 2012 నుంచే మూసివేసిన మాల్లోకి పిల్లలు ఎలా వెళ్లగలిగారు? అని మాల్ యాజమాన్యంపై కూడా కుటుంబం ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ నేపథ్యంలో పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుల పాత్ర, మాల్ భద్రతా వైఫల్యం, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇన్క్వెస్ట్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
కావిన్ తండ్రి రాహుల్ ఎగుమతి వ్యాపారం నిర్వహిస్తుండగా, తల్లి పారుల్ గృహిణి. అతడికి కెనడాలో చదువుతున్న 21 ఏళ్ల అక్క ఉంది. కావిన్ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపేవాడని, ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ రెండు గంటలు వ్యాయామం చేసేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Also Read: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 7 గురు స్పాట్ డెడ్
ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా మోజు, నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాలకు దారితీయవచ్చో హెచ్చరిస్తోంది.