ACB Raid: స్వేచ్చ బ్యూరో: సస్పెన్షన్లో ఉన్న శామీర్ పేట్ తహసీల్దార్ పై ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు గురువారం తహసీల్దార్ నివాసంతోపాటు నాలుగు చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. తనిఖీల్లో భారీగా ఆస్తులు పట్టుబడ్డాయి. ఇటీవల శామీర్ పేట్ మండలంలోని ఆలియాబాద్ గ్రామంలో 30ఎకరాల భూమి కన్వర్షన్ కోసం ఎకరానికి లక్ష చొప్పున తహసీల్దార్ సుచరిత డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో 2లక్షల రూపాయలను ఆమె తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. తాజాగా సుచరిత నివాసంతోపాటు మరో మూడు చోట్ల అధికారులు దాడి చేసి సోదాలు జరిపారు. ఈ క్రమంలో సుచరిత ఇంట్లో దాదాపు 1.20కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాల ఆభరణాలు దొరికాయి. దాంతోపాటు 12లక్షల నగదు పట్టుబడింది. ఇక, వేర్వేరు బ్యాంకుల్లో 38 లక్షల నగదు ఉన్నట్టుగా గుర్తించారు. రెండు కార్లు వొక్స్ వ్యాగన్, ఓ హ్యుందాయ్ క్రెటా కారును సీజ్ చేశారు.
Also read: మళ్లీ ముల్కీరూల్స్ తెరపైకి…! నాలుగేళ్ల స్థానికత కాదు.. పదిహేనేండ్లు అయి వుండాలె!
సుచరితకు సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం దామరకుంట గ్రామంలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్టుగా పత్రాలు దొరికాయి. దాంతోపాటు హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఫ్లాట్లు, కీసర ఖానామెట్ గ్రామాల్లో రెండు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల డాక్యుమెంట్ విలువ 5.05కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ మార్కెట్ లో వీటి విలువ వంద కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లంచం కేసులో అరెస్ట్ అయిన సుచరిత చంచల్ గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Also read: ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?