ఇప్పుడు తెలంగాణలో లోకల్, నాన్లోకల్ లొల్లి షురూ అయ్యింది. తెలంగాణ ఉద్యమం, సెంటిమెంట్.. ఇవన్నీ మెల్లమెల్లగా జనాలకు దూరమవుతూ వస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లవుతోంది. ఇప్పుడంతా డెవలప్మెంట్ మీద దృష్టి ఉంది. కానీ అడపాదడపా కొన్ని సంఘటనలు తెలంగాణవాదాన్ని తట్టి లేపుతున్నాయి. సెంటిమెంట్ను రాజేస్తున్నాయి.
తాజాగా తెలంగాణ స్థానికత మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీఆరెస్ చీఫ్ కవిత ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఆమె ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై సుప్రీం మెట్లెక్కనున్నట్టు కవిత ప్రకటించారు. నాలుగేళ్లు చదివిన వాళ్లు కూడా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు అని హైకోర్టు తీర్పు చెప్పడమే దీనికి కారణమైంది.
నాలుగేళ్లు కాదు… పదిహేను ఏళ్లు ఇక్కడ ఉన్నవాళ్లకు మాత్రమే ఇది వర్తించాలని, ముల్కీ రూల్స్ మాదిరిగానే ఇతర రాష్ట్రాలవారికి ఈ నిబంధన వర్తింపజేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవాళ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో.. మేథావి వర్గం ఏం చేస్తోంది? దీనిపై ఎవరూ ఏం మాట్లాడటం లేదెందుకు? అనే చర్చ కూడా వచ్చింది. దీనిపైనా స్పందించారు కవిత. ప్రధానంగా ప్రొఫెసర్ కోదండరామ్ను ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తమ పదవులు పోతాయనే భయంతోనే ఏం మాట్లాడటం లేదని ఆమె సెటైరికల్గా విమర్శించారు.
దీనిపై కోదండరామ్ మాట్లాడే చాన్స్ లేకపోలేదు. కానీ, కవిత స్పందించినట్టుగా ఆయన సత్వరం స్పందిచలేకపోవడంతోనే టార్గెట్ అయినట్టు తెలుస్తోంది. నిదానంగా ఆయన రేపో, ఎల్లుండో స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందు కూడా ఉద్యమకారుల ఇష్యూలో కోదండరామ్ను టార్గెట్ చేశారు కవిత. తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొంత నెమ్మదించారు.
చాలా విషయాల్లో ఆచితూచి మాట్లాడుతున్నారు. మీటింగులలో ఓపెన్గా తన స్టాండ్ను చెబుతున్నా.. ఆచరణలో మాత్రం సర్కార్ను కాదని, దానిపై ఒత్తిడి తెచ్చే విధంగా మాత్రం వ్యవహరించడం లేదు. ఉన్నంతలో సూచనలకు మాత్రమే పరిమితమవుతున్నాడు. కానీ సర్కార్ చాలా విషయాల్లో ఆయన మాటలు పెడచెవినే పెడుతున్నది. దీంతో ఆ పార్టీలో నేతలకు కూడా ఆయన వ్యవహార శైలిపట్ల తీవ్ర అసంతృప్తి ఉంది.
మరోవైపు కవిత పార్టీ పెట్టిన తరువాత ఉద్యమకారుల ఇష్యూతో పాటు .. తాజాగా ఈ స్థానికత ఇష్యూను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇలాంటి అంశాల్లో సత్వరం స్పందించాల్సిన కోదండరామ్ అండ్ టీమ్.. సర్కార్కు మిత్రపక్షం కావడంతో మౌనంగానే ఉంటున్నారు. దీన్ని పసిగట్టిన కవిత ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా కోదండరామ్ను టార్గెట్ చేస్తూ నిలదీస్తూ వస్తున్నారు.
ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా.. ఉద్యమకారుల ఆకాంక్షలు సాధించాలన్నా.. స్వరాష్ట్ర ఆశయాలు సిద్దించాలన్నా ఇప్పుడు కవితే తప్ప వేరెవరూ లేరు అఏ విధంగా రాజకీయ వాతావరణం క్రియేట్ అవుతోంది. దానికి అనుగుణంగా కవిత అడుగులు పడుతున్నాయి. మిగిలిన వారు కూడా ఆమెలా ఓపెన్గా బయటకు రాలేక పరిధులు గీసుకుని ఉండటం కూడా ఆమెకు కలిసివస్తోంది.