తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారిన స్థానికత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నాలుగేళ్ల స్థానికత ఉంటే చాలు ఇక్కడ ఉద్యోగాలు పొందవచ్చనే తీర్పుపై రగడ మొదలైంది. దీనికి ఆజ్యం పోసింది టీఆరెస్ పార్టీ. ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఇవాళ హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో స్థానికత- సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ఏర్పడి పన్నేండ్లైయిన తరువాత మళ్లీ స్థానికత అంశం తెరపైకి రావడంతో ఇప్పుడు చర్చ దీనిపైకి మళ్లింది. వాస్తవానికి దీన్నితెలంగాణకు చెందిన ఏ పార్టీ పట్టించుకోలేదు. తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్న రాష్ట్ర స్థానికత అంశంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని కవిత మండిపడుతున్నారు. తెలంగాణలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఇక్కడ చదివిన వారినే రాష్ట్ర స్థానికులుగా గుర్తించాల్సి ఉందన్నారు. దానికి విరుద్ధంగా ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పు తెలంగాణ బిడ్డలను కలచి వేసిందన్నారు.
హైకోర్టు తీర్పుపై లీగల్ ఫైట్ చేయబోతున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరిస్తే యావత్ రాష్ట్రం భగ్గుమందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలోనూ హైదరాబాద్ ను కామన్ క్యాపిటల్ చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చిప్పుడు కూడా బరిగీసి కొట్లాడి ఆ ప్రయత్నాలను విరమింపజేశామని చెప్పారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో స్థానికత అంశంపై కొట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారామె.
తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం ఒకటి నుంచి 7 వ తరగతి వరకు ఇక్కడ చదివిన వాళ్లకే స్థానికత వర్తిస్తుందని పెట్టుకున్నామని చెప్పారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివినా సరే తెలంగాణలో ప్రొఫెషనల్ కోర్సులలో చేరవచ్చని, ఆ డిగ్రీలతో రాష్ట్రంలో ఉద్యోగాలు దక్కించుకోవచ్చని కోర్టు తీర్పు ఇవ్వడాన్ని ప్రస్తావించారు. దీనిపై లీగల్ గా తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అంటేనే తెలంగాణను రక్షించేందుకు పుట్టిన పార్టీ అని అన్నారు.
స్థానికత, తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పుడిది కొత్త రాజకీయ వివాదానికి ఆజ్యం పోసింది. దీనిపై ఇంకా బీఆరెస్ స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ వైఖరి మొత్తంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని, ఇక్కడి ఆకాంక్షలకు పాతరేసే విధంగా ఉన్నాయనే కవిత విమర్శలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి.
ఆమె ఈ సర్కార్ హయాంలో జరిగిన 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియపైనా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందులో దాదాపుగా 200 మంది వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఉద్యోగాలు పొందారన్నారు. వీరిపై తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రివ్యూ చేస్తామని, జ్యూడిషియల్ కమిటీ వేస్తామని ప్రకటించడం తీవ్ర చర్చకు దారి తీసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వెంటనే ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ నుంచి తామే రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. ముల్కీ రూల్స్ మాదిరిగా పదిహేనేండ్ల స్థానికత ఉంటేనే ఇక్కడి నిరుద్యోగులకు న్యాయం జరుగుందనే వాదనను కవిత మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.