అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి (15) అనే విద్యార్థిని అకస్మాత్తుగా మృతి చెందింది. సిరి రామచంద్రాపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
సాధారణంగా తరగతులకు హాజరైన సిరి, పాఠశాలలో ఉండగానే అకస్మాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. ఇది గమనించిన ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రాథమిక పరిశీలనలో గుండెపోటు కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. అయితే స్పష్టమైన కారణాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. బాలిక మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులోనే విద్యార్థిని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.