శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గొండ్యాల పుట్టుగ సమీపంలో ఉన్న ఆర్ఎస్ఎస్ భవనం వద్ద ప్లాస్టిక్ కవర్లో శిశువు మృతదేహం లభ్యమవడం కలచివేసే విషయం. ఉదయం వేళ స్థానికులు అక్కడ ఓ కుక్క ప్లాస్టిక్ కవర్ను లాగుతూ తీసుకువెళ్లడాన్ని గమనించారు. అనుమానం కలగడంతో కవర్ను తెరిచి చూడగా లోపల శిశువు మృతదేహం ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు.
వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో కవిటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిశువు పుట్టిన వెంటనే మృతి చెందినదా..? లేక, మరే కారణాల వల్ల మృతి చెందిందా అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.
ఘటనా స్థలానికి సమీపంలో రెండు ప్రైవేట్ ఆసుపత్రులు ఉండటంతో, అక్కడి నుంచే శిశువు మృతదేహాన్ని అక్రమంగా బయటకు తరలించి వదిలేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో చుట్టి అక్కడ వదిలేశారా అనే అనుమానాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలు, ఆసుపత్రుల రికార్డులు పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.