Amberpet Family Suicide Case: అంబర్ పేట కుటుంబం విషాదాంతంలో మిస్టరీ వీడింది. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేకనే భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి ప్రాణాలు తీసుకున్నట్టుగా విచారణలో నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు నలుగురు వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి అదనపు డీసీపీ జే.నర్సయ్య, ఏసీపీ జగన్ తో కలిసి వివరాలు వెల్లడించారు. అంబర్ పేట బాపూనగర్ నివాసి కడ్గేకర్ రాంరాజ్ (54) ఆయన భార్య మాధవి, కుమారుడు కడ్గేకర్ శశాంక్ రాజ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుగుపొరుగు వారి నుంచి అందిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం రాంరాజ్ కూతురు కడ్గేకర్ అమూల్య ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీంట్లో భాగంగా సంఘటనా స్థలం నుంచి ఆత్మహత్యకు ముందు రాంరాజ్, అతని భార్య, కొడుకు రాసి పెట్టిన సూసైడ్ లెటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగానే ముగ్గురు బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలియటంతో ఆ దిశగా విచారణ కొనసాగించారు.
Also Read: CM Revanth Reddy: లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
రాంరాజ్ కొంతకాలం క్రితం మల్లాపూర్, చక్రిపురంలో ‘కింగ్స్ బిర్యాణీ’ పేర హోటళ్లు నడిపాడు. వీటిని ప్రారంభించటానికి తెలిసిన వడ్డీ వ్యాపారుల నుంచి 57 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, వ్యాపారం ఆశించినంత స్థాయిలో జరగలేదు. మరోవైపు అధిక వడ్డీకి అప్పులు చేయటంతో బాకీ మొత్తం పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వడ్డీకి అప్పు ఇచ్చిన వాళ్లు రాంరాజ్ అతని భార్య, కొడుకు నుంచి బలవంతంగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఎంఓయలపై సంతకాలు చేయించటంతోపాటు భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తీసేసుకున్నారు. దాదాపుగా ప్రతీరోజూ ఫోన్లు చేస్తూ అవమానకరంగా దూషించటంతోపాటు బెదిరిస్తూ వచ్చారు. ఇంటి వద్దకు వచ్చి అందరి ముందు పరువు తీస్తామని భయపెట్టారు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి కూడా ఫోన్లు చేసి విపరీతంగా భయపెట్టారు.
ఈ క్రమంలో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించటం) నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసి రాంరాజ్ కు అధిక వడ్డీకి అప్పులిచ్చి బెదిరించిన మౌలాలీ నివాసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ వసీ ఉజ్ జమాన్ ఎలియాస్ ఇర్ఫాన్ (57), కన్ స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్న పీ.రాజశేఖర రెడ్డి (55), పాత సఫీల్ గూడ నివాసి, వ్యాపారి అయిన మహ్మద్ నవాజ్ (50), వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన సయ్యద్ మాజిద్ హైదర్ (53)ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సంతకాలు చేసి ఉన్న 12 బ్లాంక్ చెక్కులు, 6 ప్రామిసరీ నోట్లు, 3 ఎంఓయూలు, లోన్ అగ్రిమెంట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 3 ఎకరాల వ్యవసాయ భూముల ఒరిజినల్ డాక్యుమెంట్లు, బెదిరింపులకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి చెంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు. చాకచక్యంగా కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ కిరణ్ కుమార్, డీఐ మహ్మద్ హఫీజుద్దీన్ లను డీసీపీ రక్షితా కృష్ణమూర్తి అభినందించారు.