Road Accident: అన్నమయ్య జిల్లా దేవలంపల్లి చెక్పోస్ట్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి కడప వైపు ఏడుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న కారును, ఎదురుగా వస్తున్న ఒక అంబులెన్స్ అత్యంత వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ఎంత భీభత్సంగా జరిగిందంటే.. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ప్రవీణ, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా, అంబులెన్స్ డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల దేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, బాధితుల బంధువులకు సమాచారం అందించారు.
Also Read: ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి కవలలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
అయితే పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అంబులెన్స్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బెంగళూరులో నివసిస్తున్న ఈ కుటుంబం తమ స్వస్థలమైన కడపకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.