Road Accident: అనకాపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. టెట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి ఎన్ఏడీ జంక్షన్కు చెందిన బి. సునీత.. ఈరోజు అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు పరీక్ష ఉండటంతో తండ్రి ఆటోలో తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరింది.
అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్కు చేరుకున్న సమయంలో.. ఆటో ఒక స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఆటోలో కూర్చున్న సునీత వాహనం నుంచి రోడ్డుపైకి జారిపడింది. దురదృష్టవశాత్తూ, బోల్తా పడుతున్న ఆటో ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కన్న కూతురు తండ్రి కళ్ళముందే చనిపోవడంతో ఈ ఘటన అక్కడ ఉన్న అందర్నీ కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న సునీత తండ్రి లక్ష్మణరావు మాత్రం స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. కుమార్తెను కాపాడుకోలేకపోయానని ఆవేదనతో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురు మృతదేహాన్ని మరో వాహనంలో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
Also Read: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. భార్యను చంపి స్టేటస్ పెట్టిన భర్త..
ఈ ఘటనపై బంధువులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపు తప్పడానికి గల కారణాలు, వాహన పరిస్థితి, వేగం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.