Anantapur Murder: దారుణం.. ఒక్క అనుమానం.. కుటుంబం మొత్తం చిన్నాభిన్నం.. అయితే అనంతపురం నగరంలోని ఎల్లమ్మ కాలనీలో బుధవారం తెల్లవారుజామున ఒక దారుణ హత్య చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. స్థానికంగా బేల్దారి పని చేసుకునే వీర అనే వ్యక్తి, ఒక హోటల్లో పనిచేస్తున్న తన భార్య గంగను అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. నిత్యం శ్రమించి జీవనం సాగించే ఈ కుటుంబంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘోరం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
అయితే పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై వీరకు ఉన్న అనుమానమే ఈ గొడవలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆవేశంతో ఊగిపోయిన వీర, ఇంట్లోనే ఉన్న పదునైన ఆయుధంతో గంగా గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అలాగే హత్య చేసిన అనంతరం నిందితుడు వీర నేరుగా అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు స్వయంగా ఒప్పుకోవడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు, పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.
Also Read: వైసీపీకి కోలుకోలేని దెబ్బ.. ఫ్యాన్ను పక్కన పెట్టి సైకిల్ ఎక్కిన ఉప్పలపాడు గ్రామం!
ప్రస్తుతం వన్ టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వీరను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్య కుటుంబంలో అనుమానం పెనుభూతంగా మారి ఒక ప్రాణాన్ని తీయడం, మరొకరిని జైలు పాలు చేయడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది.