Anantapur Crime: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కేఎస్ఆర్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చదవట్లేదనే ఒత్తిడిని తట్టుకోలేక నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం కేఎస్ఆర్ కాలేజీ హాస్టల్లో ఉంటున్న నలుగురు విద్యార్థినులు సరిగ్గా చదవడంలేదని హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థినులు హేయిర్ డై కెమికల్ తాగి ఆత్మహత్యకు యత్నించారు.
విషయం తెలియగానే కళాశాల సిబ్బంది విద్యార్థినులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాలేజీలో ఈ ఘటన కలకలం సృష్టించింది. నలుగురు విద్యార్థినులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం విషయంగానే ఉన్నట్లు సమాచారం.
కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో తాడిపత్రి మండలానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు చదువుతున్నారు. విద్యార్థినులు చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో తల్లిదండ్రులకు వార్డెన్ ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయంతో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకుని విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ఆరా తీస్తున్నారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలిపేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ ఘటనతో మిగతా విద్యార్థినులు కూడా భయాందోళనకు గురయ్యారు.