ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి. కడప జిల్లా బి.మఠం మండలంలో జరిగిన ఘోర ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. దొడ్ల డైరీ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఒక స్కూటర్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్కూటర్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ వేగానికి మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే స్కూటర్ లారీ కింద భాగంలో ఇరుక్కుపోయింది. దీనివల్ల రాపిడి కలిగి ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు అనంతపురం జిల్లా గుత్తిలో పెళ్ళింట తీవ్ర విషాదం నెలకొంది. పాత సీపీఐ కాలనీకి చెందిన ఒక ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండగా ఒకే రోజు వరుస మరణాలు సంభవించాయి. ఉదయం పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ చేదు వార్త నుండి తేరుకోకముందే సాయంత్రం మరో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికొడుకు మేనమామ వీరాంజీ అతిగా మద్యం సేవించి మరణించాడు. సంతోషంగా సాగాల్సిన వివాహ వేడుకలో స్నేహితులు అలాగే బంధువు మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఒకే రోజు ఇద్దరు ప్రాణ స్నేహితులు సహా మేనమామ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
ALSO READ: Jagtial Crime: ప్రేమ వివాహం.. యువకుడి కత్తులతో దారుణంగా పొడిచారు, జగిత్యాలలో ఘటన