జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రక్తసిక్తమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కక్షతో ఓ యువకుడిపై యువతి తరపు బంధువులు కత్తులతో విరుచుకుపడ్డారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
మల్యాల మండలానికి చెందిన అనిల్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో అమ్మాయి తరపు పెద్దలు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. ఈ క్రమంలో భద్రత కోసం యువతి గత ఐదు రోజులుగా జగిత్యాలలోని సఖి సెంటర్లో ఆశ్రయం పొందుతోంది. శుక్రవారం నాడు తన భార్యను ఇంటికి తీసుకెళ్లడానికి అనిల్ కుమార్ సఖి సెంటర్ వద్దకు చేరుకున్నాడు. యువతి బయటకు వచ్చే సమయం చూసి అప్పటికే అక్కడ మాటు వేసిన నిందితులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.
కత్తులతో దారుణంగా..
అనిల్ కుమార్ను చుట్టుముట్టిన యువతి బంధువులు వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన వారిని బెదిరిస్తూ రాళ్లతో బాదారు. ఈ క్రమంలో అనిల్ తల, చేయి, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ను వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
తమ ప్రాణాలకు ముప్పు ఉందని బాధితులు ఇప్పటికే మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి కుటుంబ సభ్యుల నుండి వేధింపులు ఉన్నాయని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. రక్షణ కోరుతూ అధికారులు సఖి సెంటర్కు పంపినప్పటికీ.. అక్కడే దాడి జరగడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కులాంతర వివాహాల విషయంలో ఇంకా ఇటువంటి దాడులు జరగడం పట్ల సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ దాడితో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ALSO READ: Rinku Singh : తండ్రి పాడె మోసిన రింకూ సింగ్…చనిపోయే ముందు వీడియో కాల్, కన్నీళ్లు ఆగవు