Bengaluru News: బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో 16వ అంతస్తు నుంచి పడి మృతి చెందాడు 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే టెక్కీ మరణం వెనుక రకరకాల కారణాలు, అనుమానాలు లేకపోలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
టెక్కీది ఆత్మహత్యా? ప్రమాదవశాత్తూ జరిగిందా?
బెంగుళూరులో టెక్కీ నిక్షేప్ మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. టెక్కీ వయస్సు 26 ఏళ్లు. యూరప్లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసి నగరానికి చేరుకున్నాడు. ఇంటి నుంచే టెక్కీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మృతుడి సొంతూరు మంగళూరుకు చెందిన నిక్షేప్గా గుర్తించారు. శెట్టిహళ్లిలోని ప్రిన్స్టౌన్ అపార్ట్మెంట్స్లో బుధవారం ఉదయం ఘటన చోటు చేసుకుంది.
ఉదయం 8.15 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిక్షేప్ కుటుంబానికి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని ఓ ఫ్లాట్ ఉంది. తల్లిదండ్రులు కిషోర్-జయశ్రీలతో కలిసి ఉంటున్నాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్నివిషయాలు బయటకు వచ్చాయి. నిక్షేప్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని తెలుస్తోంది. దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నట్లు సమాచారం.
బెంగుళూరులో దారుణం.. 16వ అంతస్తు నుంచి పడి టెక్కీ మృతి
స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతున్నాడని, దీనివల్ల మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు నిక్షేప్ తన అపార్ట్మెంట్కు వచ్చాడు. కానీ కుటుంబం నివాసం ఉంటున్న ఫ్లాట్కి వెళ్లలేదు. బదులుగా 16వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుండి పడి చనిపోయాడని భావిస్తున్నారు పోలీసులు.
గడిచిన రెండు రోజులు హెసరఘట్టలోని గౌడి మఠంలో బస చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల నిక్షేప్ తన తండ్రిపై దాడికి ప్రయత్నించాడని ఆరోపణలు లేకపోలేదు. ఈ ఘటన తర్వాత అతడి మానసిక ఆనారోగ్య సమస్యల తీవ్రతను సూచిస్తుందని చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: చెట్టుని ఢీ కొన్న స్పోర్ట్స్ కారు.. స్పాట్లో నలుగురు విద్యార్థులు మృతి
ఆ ప్రక్రియ తర్వాత మృతదేహాన్ని అంతిమ సంస్కారాలకు మంగళూరుకు తరలించారు. నిక్షేప్ తండ్రి కిషోర్ కొన్ని విషయాలు వెల్లడించాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫోన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్కు రమ్మని చెప్పారు. తాము కిందకు వెళ్లేసరికి నిక్షేప్ విగతజీవిగా పడి ఉన్నాడని కన్నీరుమున్నీరు అయ్యాడు.