Body in Deep Freezer: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. బక్షి కా తాలాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని GCRG కాలేజ్ గేటుకు ఎదురుగా ఉన్న ఒక వెజ్ బిర్యానీ సెంటర్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని షాపులోని డీప్ ఫ్రీజర్లో కుక్కి ఉంచారు. నాలుగు రోజుల తర్వాత షాపు తెరిచిన యజమానికి శవం కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడు ఎవరు? అతను అక్కడికి ఎలా వచ్చాడు? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. షాపు మూసి ఉన్న సమయంలోనే ఎవరో కావాలని మృతదేహాన్ని అక్కడ దాచిపెట్టారా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బిర్యానీ షాపు యజమాని తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గత 4 రోజులుగా షాపును మూసివేసి ఊరికి వెళ్లారు. తండ్రి కర్మకాండలు ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన.. సోమవారం షాపు తెరిచారు. సాధారణ తనిఖీల్లో భాగంగా షాపులోని డీప్ ఫ్రీజర్ను తెరిచి చూడగా అందులో ఒక యువకుడి శవం కనిపించింది. భయాందోళనకు గురైన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు షాపు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నాలుగు రోజుల పాటు షాపు తాళం వేసి ఉన్నప్పటికీ నిందితులు లోపలికి ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. స్థానికులను, షాపు యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో కాలేజీ సమీపంలోని విద్యార్థులు, నివాసితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోస్ట్మార్టం నివేదిక వస్తేనే ఆ యువకుడు హత్యకు గురయ్యాడా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది.